టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. వెస్టిండీస్తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్లో యశస్వి జైస్వాల్ 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్(162 బంతుల్లో 16 ఫోర్లతో 111 బ్యాటింగ్)కు ఇది ఏడో టెస్ట్ సెంచరీ. 24 ఏళ్ల వయసులోనే అత్యధిక టెస్ట్ శతకాలు బాదిన నాలుగో బ్యాటర్గా జైస్వాల్ రికార్డ్కెక్కాడు.
ముగ్గురు బ్యాటర్లు మాత్రమే 24 వయసులో 7 కంటే ఎక్కువ సెంచరీలు బాదారు. 24 ఏళ్ల వయసులో డాన్ బ్రాడ్మన్ 12 సెంచరీలు, సచిన్ టెండూల్కర్ 11 సెంచరీలు, సోబెర్స్ 9 సెంచరీలు మాత్రమే జైస్వాల్ కంటే ముందున్నారు.
జైస్వాల్ టీమిండియా ఓపెనర్గా బరిలోకి దిగినప్పటి నుంచి అతనొక్కడే 7 టెస్ట్ శతకాలు నమోదు చేస్తే.. మిగతా ఓపెనర్లు అంతా కలిసి 6 సెంచరీలే బాదారు. జైస్వాల్కు అండగా సాయి సుదర్శన్(71 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఈ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. టీ బ్రేక్ సమయానికి భారత్ 58 ఓవర్లలో వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(38), యశస్వి జైస్వాల్ తొలి వికెట్కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వారికన్ బౌలింగ్లో రాహుల్ స్టంపౌట్ అయినా.. సాయి సుదర్శన్తో కలిసి యశస్వి జైస్వాల్ చెలరేగాడు. దాంతో 94/1 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లిన టీమిండియా.. రెండో సెషన్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
82 బంతుల్లో జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 87 బంతుల్లో సాయి సుదర్శన్ అర్థ సెంచరీ సాధించాడు. సెంచరీ అనంతరం జైస్వాల్ క్లాసిక్ షాట్స్తో చెలరేగాడు. ఖారీ పియర్ బౌలింగ్లో క్విక్ డబుల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సాయి సుదర్శన్ ఇచ్చిన క్యాచ్ను విండీస్ ఆటగాళ్లు నేలపాలు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. భారత బ్యాటర్ల ధాటికి విండీస్ బౌలర్లు తేలిపోతున్నారు. వారిని ఔట్ చేసేందుకు శ్రమిస్తున్నారు.