డొమినికా: అరంగేట్ర టెస్ట్లో సెంచరీ సాధించడంపై టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం దక్కిందన్నాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్లో యశస్వీ జైస్వాల్ (387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 171) సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది.
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వీ జైస్వాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా తన ఇన్నింగ్స్పై స్పందించిన యశస్వి జైస్వాల్.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని తెలిపాడు. భవిష్యత్తులో టీమిండియా తరఫున గొప్ప ఇన్నింగ్స్లు ఆడాలనుకుంటున్నానని చెప్పాడు.

తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సందర్భంగా యశస్వి కృతజ్ఞతలు తెలిపాడు. 'ఈ టెస్టు మ్యాచ్ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఆ శ్రమకు తగ్గ ఫలితం వచ్చింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో ఎన్నో విషయాలపై చర్చించా. అలాగే నాకు అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మకు కృతజ్ఞతలు.
నాపై ఎంతో నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్ కోసం క్రమశిక్షణగా ఉన్నా. కేవలం సన్నద్ధతపై మాత్రమే దృష్టిపెట్టా. భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం గర్వకారణం. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమే. భారత్ తరఫున సుదీర్ఘ కాలం ఆడాలనుకుంటున్నా.
దాని కోసం నా ఆటపై మరింత దృష్టిపెట్టి శ్రమించాల్సిన అవసరం ఉంది. ఇక్కడి వరకు చేరే ప్రయాణంలో ఎంతో మంది నాకు సహకారం అందించారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా. సీనియర్ ఆటగాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడం గొప్పగా అనిపించింది. ఇలాగే నేర్చుకుంటూ ముందుకు సాగడమే నా లక్ష్యం'అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
విదేశాల్లో అరంగేట్ర టెస్టులోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. యశస్వి సూపర్ ఇన్నింగ్స్కు తోడుగా రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా.. కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 421/5 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 130 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.
అశ్విన్(7/71) ఏడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, సిరాజ్ ఓ వికెట్ తీసారు. తొలి ఇన్నింగ్స్లో విండీస్ 150 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే.