న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు తన జీవితంలో కీలక పాత్ర పోషించారని, విలువైన సలహాలతో తన కెరీర్ను మరో మెట్టు ఎక్కించారని యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ తెలిపాడు. ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన యశస్వీ.. వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన టెస్ట్ టీమ్లో చోటు దక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశస్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విరాట్ కోహ్లీ భయ్యా, ధోనీ సర్.. నా కెరీర్లో కీలక పాత్ర పోషించారు. నేను వారి నుంచి సలహాలు స్వీకరించాను. వారి సూచనలను నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారితో మాట్లాడితే ఎంతో నేర్చుకోవచ్చు.

చాలా ఓపిక ఉండాలి. నేను ఏం చేయాలో దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఇతర విషయాల గురించి పెద్దగా పట్టించుకోను. నా ఆటతీరును మెరుగుపరిచే అంశాలు ఉంటే వాటిపై దృష్టిసారిస్తా. నేను ఆటను గౌరవిస్తాను. నా నైపుణ్యాలను ఉపయోగించి వినోదాన్ని అందించగలిగితే అది నాకెంతో ఆనందాన్ని కల్గిస్తుంది.
ఎవరైనా 'వావ్, యశస్వి భలే షాట్ ఆడాడు, అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు, సూపర్ త్రో రనౌట్ చేశాడని అంటే వాటిని తలకెక్కించుకోకుండా ఆశీర్వాదంగా భావిస్తాను. ప్రశాంతంగా ఉంటూ ఆటను ఆస్వాదించాలనుకుంటున్నా'' అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో 14 మ్యాచ్ల్లో 48.08 సగటుతో 625 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా బాదేశాడు. కోల్కతా నైట్రైడర్స్పై 13 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని రికార్డు ఐపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును నమోదు చేశాడు.