Yashasvi Jaiswal: తన వల్లే రనౌట్ అయిన రుతురాజ్ గైక్వాడ్కు క్షమాపణలు చెప్పానని టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో యశస్వి జైస్వాల్ మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 25 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్లతో 53 పరుగులు చేశాడు.
ఫీల్డింగ్లో రెండు అద్భుత క్యాచ్లు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెరుపు హాఫ్ సెంచరీతో పాటు కీలక క్యాచ్లు అందుకున్న యశస్వి జైస్వాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఈ అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడిన యశస్వి జైస్వాల్.. గత మ్యాచ్లో తాను చేసిన తప్పిదాన్ని అంగీకరించాడు.

వైజాగ్ వేదికగా జరిగిన తొలి టీ20లో తన వల్లనే రుతురాజ్ గైక్వాడ్ రనౌటయ్యాడని యశస్వి తెలిపాడు. అందుకు అతన్ని క్షమాపణలు కోరానని, రుతురాజ్ చాలా మంచి వ్యక్తి అని, జాగ్రత్తగా ఉంటాడని చెప్పుకొచ్చాడు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ లక్ష్మణ్ సహకారంతోనే తాను స్వేచ్చగా ఆడి మెరుపు హాఫ్ సెంచరీ బాదనని జైస్వాల్ వివరించాడు. 'మైదానంలో స్వేచ్ఛగా ఆడమని మ్యాచ్కు ముందు సూర్య భాయ్, కోచ్ లక్ష్మణ్ సర్ చెప్పారు. దాంతో నా సత్తా ఏంటో మైదానంలో చూపించాలనుకున్నా. నా వరకు నేను ఆటను మరింత మెరుగుపరుచుకోవడంపైనే ఫోకస్ పెట్టాను.
అంతకు మించి మరేది ఆలోచించడం లేదు. నేను ఇప్పటికీ ఆటను నేర్చుకుంటూనే ఉన్నాను. అన్ని రకాల షాట్లను సమర్థవంతంగా ఆడాలని భావిస్తున్నా. దానికోసం మానసికంగా మరింత బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.'అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో సాధించిన హాఫ్ సెంచరీతో యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన మూడో భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(50), కేఎల్ రాహుల్(50) యశస్వి కన్నా ముందున్నారు.