ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో సెంచరీ చేసుకునే అవకాశం చేజారినందుకు ఎలాంటి బాధ లేదని టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తెలిపాడు. తాను సెంచరీ కోసం ఆడలేదని స్పష్టం చేశాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 80 పరుగుల వద్ద క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అతను జోరూట్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. తొలి రోజు విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన అతను రెండో రోజు ఆటలో నాలుగో బంతికే ఔటయ్యాడు. రెండో రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన యశస్వి.. సెంచరీ చేజారినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని పేర్కొన్నాడు.

'ఈ మ్యాచ్లో నేను సెంచరీ చేసి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. అయితే పరుగులు చేయడంపైనే నేను ఫోకస్ పెట్టాను. సానుకూల ధృక్పథంతో బ్యాటింగ్ చేయడం నా విధానం. జట్టు కోసం పరుగులు చేస్తూ ఇన్నింగ్స్ నిర్మించడంపైనే నేను ఫోకస్ పెట్టాను. ఈ మ్యాచ్లో సెంచరీ మిస్సైనా ఏ బాధ లేదు. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను.
భారత్లో నాకు ఇదే తొలి టెస్ట్. జట్టుకు కావాల్సిన పరుగులు చేయడంతో పాటు అద్భుత ప్రదర్శన కనబర్చాలని మాత్రమే నేను భావించాను. సెంచరీలు, రికార్డులపై ఫోకస్ పెట్టలేదు. వెస్టిండీస్, సౌతాఫ్రికాలో నేను భిన్నమైన వాతావరణంలో బ్యాటింగ్ చేశాను. ఇక్కడ కూడా విభిన్నమైన వాతావరణం ఉంది. ఈ మూడు ప్రదేశాలను నేను ఆస్వాదించాను. నా దేశం తరఫున ఆడే ప్రతీ క్షణాన్ని నేను గొప్పగా.. గౌరవంగా ఫీలవుతాను.
నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జోరూట్తో బౌలింగ్ చేయిస్తారనే విషయం నాకు తెలుసు. అతన్ని ఎదుర్కొనేందుకు నేను సన్నదమయ్యాను కూడా. అతని బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని భావించాను. కానీ కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతుంటాయి. తప్పిదం చేసినప్పుడు ఔట్ అవుతాం. ఇప్పటికీ నేను నేర్చుకునే ఉంటున్నాను. తప్పిదాలు చేసినప్పుడు వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడం నాకు అలవాటు.'అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 110 ఓవర్లలో 7 వికెట్లకు 421 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(74 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 80), కేఎల్ రాహుల్(123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 86), రవీంద్ర జడేజా(155 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 81 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
తెలుగు తేజం కేఎస్ భరత్(81 బంతుల్లో 3 ఫోర్లతో 41) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ, జోరూట్ రెండేసి వికెట్లు తీయగా.. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 175 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.