ఫీల్డింగ్ మెరుగవ్వడంతోనే వైజాగ్ టెస్ట్లో విజయం సాధించామని టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తెలిపాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్ట్లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ విజయంతో తొలి టెస్ట్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన.. ఐదు టెస్ట్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయానంతరం మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ మ్యాచ్ను బాగా ఆస్వాదించాం. దేశం తరఫున విజయం సాధించడం ఎప్పుడైనా.. ఎవరికైనా అత్యుత్తమ క్షణమే.

మేం మా విధానంపై మాత్రమే ఫోకస్ పెట్టాం. తొలి టెస్ట్ పరాజయం అనంతరం ఫీల్డింగ్ను మెరుగుపరుచుకోవాలనుకున్నాం. ఈ మ్యాచ్లో చాలా మెరుగ్గా ఫీల్డింగ్ చేశాం. అది మా విజయానికి బాటలు వేసింది. పిచ్పై క్రాక్స్ రావడంతో పాటు సీమ్ మూవ్మెంట్ ఉంది. ఈ పరిస్థితుల్లో నాలుగో ఇన్నింగ్స్ ఆడటం చాలా కష్టం.
వైట్ బాల్, రెండ్ బాల్ ఫార్మాట్కు చాలా తేడా ఉంటుంది. ఈ మ్యాచ్లో నేను చివరి వరకు ఆడే ప్రయత్నం చేశాను. కానీ వైట్బాల్ గేమ్లో తొలి బంతి నుంచే పరుగులు చేయాలనే ఇంటెంట్తో బ్యాటింగ్ చేస్తాను. జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్లిప్లో నిల్చున్నా బంతి వేగంగా దూసుకొచ్చింది.
రెండో ఇన్నింగ్స్లో కూడా చివరి వరకు ఆడాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ చేశాను. కొత్త బంతి పాతబడే వరకు ఆడి ఇన్నింగ్స్ నిర్మించాలనుకున్నా. కానీ దురదృష్టవశాత్తు త్వరగా ఔటయ్యాను.'అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(209) ఒక్కడే డబుల్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకు కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(6/45) 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో భారత్కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్(104) ఒక్కడే సెంచరీ సాధించగా.. అక్షర్ పటేల్(45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యం నమోదమవ్వగా.. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. జాక్ క్రాలీ(132 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 73) ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. బెన్ ఫోక్స్(69 బంతుల్లో 4 ఫోర్లు సిక్స్తో 36), టామ్ హార్ట్లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(3/72), జస్ప్రీత్ బుమ్రా(3/46) మూడేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.