వెస్టిండీస్తో రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. యశస్వి జైస్వాల్(253 బంతుల్లో 22 ఫోర్లతో 173 బ్యాటింగ్) అజేయ శతకానికి తోడుగా.. సాయి సుదర్శన్(165 బంతుల్లో 12 ఫోర్లతో 87) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 2 వికెట్లకు 318పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్తో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్(20 బ్యాటింగ్) ఉన్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోమెల్ వార్రి కెన్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్(38), యశస్వి జైస్వాల్ శుభారంభం అందించారు. కొత్త బంతితో ఆచితూచి ఆడిన ఈ జోడీ తొలి వికెట్కు 58 పరుగులు జోడించింది. వారికన్ బౌలింగ్లో స్టెప్ ఔటై ఆడబోయిన రాహుల్.. స్టంపౌట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి సాయి సుదర్శన్ రాగా మరో వికెట్ పడకుండా యశస్వి జైస్వాల్ తొలి సెషన్ను ముగించాడు. దాంతో టీమిండియా 94/1 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.

రెండో సెషన్లో మరింత సాధికారికంగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్, సాయి సుదర్శన్.. బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 82 బంతుల్లో జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 87 బంతుల్లో సాయి సుదర్శన్ అర్థ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ అనంతరం జైస్వాల్ క్లాసిక్ షాట్స్తో చెలరేగాడు. ఖారీ పియర్ బౌలింగ్లో క్విక్ డబుల్ తీసిన జైస్వాల్ 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో యశస్వికి ఇది ఏడో టెస్ట్ సెంచరీ కాగా..తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు.
సాయి సుదర్శన్ ఇచ్చిన సునాయస క్యాచ్ను విండీస్ ఆటగాళ్లు నేలపాలు చేశారు. ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు విండీస్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో భారత్ 220/1 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లోనూ జైస్వాల్, సాయి సుదర్శన్ తమ జోరును కొనసాగించారు. విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్ను స్టన్నింగ్ డెలివరీతో జోమెల్ వారికన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో రెండో వికెట్కు నమోదైన 193 పరుగుల భాగస్వామ్యాని తెరపడింది.
క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి యశస్వి జైస్వాల్ తన జోరును కొనసాగించాడు. 224 బంతుల్లో 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. మరోవైపు గిల్ తన క్లాస్ బ్యాటింగ్తో జైస్వాల్కు అండగా నిలిచాడు. దాంతో మూడో సెషన్లోనూ విండీస్కు ఒక్క వికెట్ దక్కలేదు. దాంతో తొలి రోజు ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది.