టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. 23 ఏళ్ల వయసులోనే ఇంగ్లండ్పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ను జైస్వాల్ అధిగమించాడు. ఇంగ్లండ్తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడిన జైస్వాల్ 44 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్పై యశస్వి జైస్వాల్కు ఇది 9వ 50 ప్లస్ స్కోర్. ఇంగ్లండ్తో 19 ఇన్నింగ్స్ల్లో జైస్వాల్ 3 శతకాలతో పాటు 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. 23 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్.. ఇంగ్లండ్తో 14 ఇన్నింగ్స్లు ఆడి 8 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశాడు. ఈ రికార్డ్ చాలా కాలం సచిన్ పేరిట ఉండగా.. ఇన్నాళ్లకు జైస్వాల్ అధిగమించాడు.

ఈ జాబితాలో యశస్వి జైస్వాల్(9), సచిన్ టెండూల్కర్(8) తర్వాత మహమ్మద్ అజారుద్దీన్(11 ఇన్నింగ్స్ల్లో 5), కపిల్ దేవ్(20 ఇన్నింగ్స్ల్లో 5), రిషభ్ పంత్ (19 ఇన్నింగ్స్ల్లో 5), దిలిప్ సర్దేశాయ్(11 ఇన్నింగ్స్ల్లో 5), రవి శాస్త్రి(20 ఇన్నింగ్స్ల్లో 5) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టెస్ట్ల్లో ఇంగ్లండ్పై అత్యధిక సిక్స్లు బాదిన మూడో బ్యాటర్గా కూడా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఇప్పటికే 30 సిక్స్లు బాదిన యశస్వి జైస్వాల్.. మరో ఐదు సిక్స్లు కొడితే వివ్ రిచర్డ్స్ 34 సిక్స్ల రికార్డ్ను అధిగమిస్తాడు. టెస్ట్ల్లో ఇంగ్లండ్పై అత్యధిక సిక్స్లు బాదిన రికార్డ్ రిషభ్ పంత్ పేరిట ఉంది. అతను 38 సిక్స్లు కొట్టాడు.
ఈ మ్యాచ్లో భారత్ నిలకడగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి 44 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(85 బ్యాటింగ్) సెంచరీ దిశగా సాగుతుండగా.. శుభ్మన్ గిల్(11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. నైట్వాచ్మన్గా బ్యాటింగ్కు దిగిన ఆకాష్ దీప్(94 బంతుల్లో 12 ఫోర్లతో) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జెమీ ఓవర్టన్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటవ్వగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులు చేసింది.