టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలి ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్ 4 బౌండరీలు బాది 16 పరుగులు పిండుకున్నాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇన్నింగ్స్ తొలి ఓవర్లో భారత బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఈ క్రమంలోనే అతను వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల రికార్డ్ను అధిగమించాడు. 2005లో కోల్కతా టెస్ట్లో సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు చేశాడు. 2023లో నాగ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో కమిన్స్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ 13 పరుగులే చేసి సెహ్వాగ్ రికార్డ్ సమం చేశాడు. తాజా మ్యాచ్లో యశస్వి ఈ ఇద్దర్నీ అధిగమించాడు.

స్టార్క్ వేసిన తొలి బంతిని డాట్ చేసిన యశస్వి జైస్వాల్.. షార్ట్ పిచ్గా వచ్చిన రెండో బంతిని స్లిప్ కార్డన్ మీదుగా బౌండరీ తరలించాడు. మూడో బంతిని కూడా స్టార్క్ బౌన్సర్గా సంధించగా.. జైస్వాల్ బౌండరీ కొట్టాడు. నాలుగో బంతిని లేట్ కట్తో బౌండరీగా తరలించాడు. హ్యాట్రిక్ బౌండరీల తర్వాత డాట్ బాల్ ఆడిన యశస్వి.. చివరి బంతిని కూడా బౌండరీ కొట్టి 16 పరుగులు పిండుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అయితే ఈ జోరును యశస్వి జైస్వాల్(22) ఎక్కువ సేపు కొనసాగించలేకపోయాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్తో కలిసి యశస్వి జైస్వాల్ తొలి వికెట్కు 42 పరుగులు జోడించాడు. కేఎల్ రాహుల్(13), శుభ్మన్ గిల్(13), విరాట్ కోహ్లీ(6), దారుణంగా విఫలమవ్వగా.. రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు.
రవీంద్ర జడేజా(8 బ్యాటింగ్)తో కలిసి ఐదో వికెట్కు 46 పరుగులు జోడించాడు. అతన్ని కమిన్స్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి(4) తీవ్రంగా నిరాశపరిచాడు. బోలాండ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ సాయంతో జడేజా మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది.
అంతకుముందు 9/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే.