యువ పేసర్, ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్ భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడంపై అతని తండ్రి చందర్పాల్ దయాల్ సంతోషం వ్యక్తం చేశారు. యశ్ దయాల్ పడ్డ కష్టానికి ప్రతి ఫలం దక్కిందని, అతని తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఇంతకు మించిన సంతోషకరమైన సందర్భం ఏది లేదన్నారు.
అయితే ఐపీఎల్ 2023 సీజన్లో రింకూ సింగ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ తమకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ తమకు ఓ ప్రమాదం వంటిదని అభివర్ణించారు.

'రింకూ సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ మాకు ఓ ప్రమాదం లాంటిది. 'రింకూ సింగ్ రింకూ సింగ్.. ఐదు సిక్స్లు'అనే పిల్లల అరుపులతో మా ముందు నుంచి స్కూల్ బస్ వెళ్లినట్లుగా ఆ ఘటన మా జీవితంలో చోటు చేసుకోంది. అది మాకు ఎంతో బాధను మిగిల్చింది. నా కొడుక్కే ఇలా ఎందుకు జరిగిందనిపించింది?
యశ్ దయాల్ తల్లి రాధా తీవ్ర బాధకు గురై అనారోగ్యం పాలైంది. యశ్ దయాల్ బాధపడటం చూసి ఆమె ఏం తినలేకపోయింది. గుజరాత్ టైటాన్స్ కూడా వదిలేయడంతో యశ్ దయాల్ తన కెరీర్ను మళ్లీ నిర్మించుకోవాల్సి వచ్చింది. ఈ కష్ట సమయంలో యశ్ దయాల్కు కుటుంబంగా మేం అండగా నిలిచాం.
ఏదైతే అది జరగని నీ ప్రయత్నం నీవు చేయమని చెప్పాం. భారత్ తరఫున బరిలోకి దిగేవరకు ఆటను ఆపవద్దని గట్టిగా సూచించాం. నీవు ఖచ్చితంగా భారత్కు ఆడుతావని మోటివేట్ చేశాం. చివరకు అతను అనుకున్నది సాధించాడు. అతని తండ్రిగా నాకు ఇంతకు మించిన గొప్ప క్షణం ఏదీ లేదు. ఏ క్రికెటర్కు అయినా టెస్ట్ల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించడం కల.
ఇది మా కుటుంబానికి, స్నేహితులకు గొప్ప రోజు. ఈ క్రెడిట్ పూర్తిగా యశ్ దయాల్దే. అతని కష్టం ముందు నేను పడ్డ శ్రమ చాలా చిన్నది. అతని కష్టంతోనే యశ్ దయాల్ ఈ స్థాయికి చేరుకోగలిగాడు. యశ్ దయాల్కు సహజమైన నైపుణ్యం ఉంది. నేను ఏ రోజు కూడా అతనికి క్రికెట్ నేర్పించలేదు. మా కుటుంబం అతనికి మానిసక బలాన్ని మాత్రమే ఇచ్చాం.'అని చందర్పాల్ దయాల్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ వరుసగా 5 సిక్స్లు బాది కేకేఆర్కు సంచలన విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ రింకూ సింగ్ను స్టార్గా నిలబెట్టగా యశ్ దయాల్ను జీరో చేసింది. ఈ ఇన్నింగ్స్తో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిన యశ్ దయాల్.. అనారోగ్యానికి గురై జట్టులో కూడా చోటు కోల్పోయాడు.
ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో ఆర్సీబీ అతన్ని అనూహ్యంగా రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆరంభంలో కాస్త తడబడిన యశ్ దయాల్.. ఆ తర్వాత సంచలన ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కోహ్లీ సలహాలతో మరింత రాటుదేలిన యశ్ దయాల్.. దులీప్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో టీమిండియా టెస్ట్ టీమ్ పిలుపు అందుకున్నాడు.
బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్కు బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్లో యశ్ దయాల్కు అవకాశం దక్కింది.