న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో చెత్త రికార్డు నమోదు చేసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్కు అతని తండ్రి అండగా నిలిచాడు. ఏ మాత్రం భయపడొద్దని, తాను అండగా ఉంటానని చెప్పాడు. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో యశ్ దయాల్ ఆఖరి ఓవర్లో 29 పరుగులు సమర్పించుకొని గుజరాత్ ఓటమికి కారణమయ్యాడు.
కేకేఆర్ హిట్టర్ రింకూ సింగ్ ధాటికి వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లను సమర్పించుకున్నాడు. యార్కర్లు వేసే ప్రయత్నంలో యశ్ దయాల్ వరుసగా మూడు ఫుల్టాస్లు వేసాడు. వాటిని రింకూ సింగ్ సిక్సర్లుగా మలచగా.. యశ్ దయాల్ ఒత్తిడికి గురై... చివరి రెండు బంతులను కూడా షార్ట్ పిచ్ బాల్స్గా సందించాడు. రింకూ సింగ్ అసాధారణ బ్యాటింగ్తో వాటిని కూడా సిక్సర్లుగా మలిచి చిరస్మరణీయ విజయాన్నందించాడు.

దాంతో యశ్ దయాల్ 4 ఓవర్లలో 69 రన్స్ ఇచ్చి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్గా చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ జాబితాలో బాసిల్ థంపి(70) అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 2018లో సన్రైజర్స్ తరఫున ఆర్సీబీకి 4 ఓవర్లలో 70 రన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి తర్వాత ఇషాంత్ శర్మ(66), ముజీబ్ రెహ్మాన్(66), ఉమేశ్ యాదవ్(65) ఉన్నారు.
రింకూ సింగ్ ధాటికి యశ్ దయాల్ కన్నీటి పర్యంతమయ్యాడు. రిస్ట్ బ్యాండ్ను అడ్డం పెట్టుకొని ఏడ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే యశ్ దయాల్కు మాజీ క్రికెటర్లు, అభిమానులతో పాటు కేకేఆర్ టీమ్ కూడా మద్దతు తెలిపింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇలాంటివి సహజమని, బిగ్ ప్లేయర్లు కూడా ధారళంగా పరుగులిచ్చుకున్నారని గుర్తు చేస్తూ అండగా నిలుస్తున్నారు.
యశ్ దయాల్ తండ్రి కూడా కొడుకుకు ధైర్యం చెప్పాడు. తదుపరి మ్యాచ్కు తాను హాజరవుతానని తెలిపాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..
'మ్యాచ్ ముగిసిన వెంటనే నేను యశ్కు ఫోన్ చేసి మాట్లాడాను. ఏ మాత్రం భయపడవద్దని, నిరాశకు గురికావద్దని సూచించాను. క్రికెట్లో ఇలా జరగడం ఇదే కొత్త కాదు.
బౌలర్లను బాదడం సహజమే. పెద్ద పెద్ద బౌలర్లు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎక్కడ తప్పు చేశావో తెలుసుకొని మరింత కష్టపడమని సూచించాను. యశ్ నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంటాడు. ఇది అతనికి డార్క్ నైట్. కచ్చితంగా అతను పుంజుకుంటాడు.
స్టేడియంలో ఉన్న యశ్ సోదరి, మామ, అత్తలను వెంటనే అతన్ని కలిసి మోటీవేట్ చేయాలని చెప్పాను. అతను తీవ్ర నిరాశలో ఉన్నాడు. మన మద్దతు ముఖ్యమని సూచించాను'అని యశ్ తండ్రి చెప్పుకొచ్చాడు.