న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ను ఆస్ట్రేలియా జట్టే గెలుచుకుంటుందని పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ అన్నాడు. లండన్లోని ఓవల్ మైదానం వేదికగా బుధవారం (జూన్ 7) నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
అయితే భారత్ కంటే ఆస్ట్రేలియాకే ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఓవల్లో విపరీతమైన స్వింగ్, బౌన్స్ ఉంటుందని, ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొవడం టీమిండియా బ్యాటర్ల వల్ల కాదన్నాడు.

'ఓవల్లో సాధారణంగా టెస్ట్ మ్యాచ్లు ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమవుతాయి. అప్పుడు పిచ్ డ్రైగా ఉంటుంది కాబట్టి బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్లోనే జరుగుతుంది. కాబట్టి పిచ్ చాలా తాజాగా ఉండనుంది. దాంతో ఈ వికెట్పై బంతి ఎక్కువగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది.
అంతేకాకుండా ఈ మ్యాచ్కు డ్యూక్ బంతిని వాడుతుండటంతో స్వింగ్ కూడా ఎక్కువగా ఉండనుంది. ఎందుకంటే కూకబుర్ర కంటే డ్యూక్ బాల్ చాలా గట్టిగా ఉంటుంది. ఆసీస్ బౌలర్లు ఎక్కువగా బౌన్స్ వేసే అవకాశం ఉంది. స్వింగ్, బౌన్స్కు అనుకూలంగా ఉన్న వికెట్పై ఆసీస్ పేస్ను ఎదుర్కొవడం భారత బ్యాటర్లకు సవాల్తో కూడుకున్నదే. చాలా ఇబ్బంది పడనున్నారు.
అంతేకాకుండా ఆసీస్ బౌలింగ్తో పోల్చితే భారత బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఆస్ట్రేలియానే ఈ మ్యాచ్ గెలుస్తుంది. 'అని వసీం అక్రమ్ ఐసీసీ రివ్యూ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. వసీం అక్రమ్తో పాటు ఇతర మాజీ ఆటగాళ్లు సైతం డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియానే ఫేవరేట్ అని తెలిపారు.

అయితే ఈ వాదనను టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి తప్పుబట్టాడు. ఎంత బలమైన జట్టుకు అయినా ఓటమి ఎదురువ్వాలంటే ఒక్క సెషన్ సరిపోతుందన్నాడు. విజయం సాధించాలంటే కాసింత అదృష్టం కూడా ఉండాలన్నాడు. అవకాశాలు సృష్టించుకుంటూ అత్యుత్తమ క్రికెట్ ఆడిన జట్టునే విజయం వరిస్తుందన్నాడు.