
సౌతాంప్టన్: టీమ్ కాంబినేషన్పై వెంటనే సమీక్షించుకుంటామని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాగా ఆడగలిగే సరైన వైఖరి గల ఆటగాళ్లను ఎంపిక చేస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. బుధవారం ముగిసిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసింది. ఈ ఓటమి అనంతరం వర్చువల్గా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన కోహ్లీ.. తప్పిదాలను సవరించుకొని బెస్ట్ టీమ్ను రెడీ చేస్తామన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాదిరిగా పటిష్ఠమైన టెస్టు జట్టను రూపొందించుకుంటామని వివరించాడు. కొందరు ఆటగాళ్లు పరుగులు చేసేందుకు అవసరమైన తీవ్రతను ప్రదర్శించలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'మా తప్పిదాలను సమీక్షించుకుంటాం. అన్ని రకాల బంతులు, విభిన్న రకాల వాతావరణంలో ఆడగలిగేలా టీమిండియాను పటిష్ఠంగా మారుస్తాం. ఈ ప్రణాళికలు అమలు చేసేందుకు మేం ఏడాది సమయమేమీ తీసుకోం. వెంటనే చర్యలు ప్రారంభిస్తాం. మా పరిమిత ఓవర్ల జట్టును చూడండి. ఆటగాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. దేనికైనా సిద్ధమే అంటారు. టెస్టు జట్టులోనూ అలాంటి మార్పులు తీసుకురావడం అవసరం. టీమ్ రాణించేందుకు, నిర్భయంగా ఆడేందుకు ఏం చేయాలో కనుక్కోవాల్సి అవసరం ఉంది. సరైన వైఖరితో ఆడగలిగే ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావాలి. ఎక్కువ పరుగులు చేసేందుకు మేం ప్రణాళికలతో ముందుకు రావాలి. మరీ వ్యత్యాసం రాకుండా జోరు కొనసాగించాలి. టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నట్టు నాకైతే అనిపించడం లేదు.
ఆట, పరిస్థితులపై మాకు మరింత అవగాహన అవసరం. బౌలర్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టకుండా నిర్భయంగా ఆడాలి. తొలిరోజు మాదిరిగా మరీ స్వింగైతే, చల్లని వాతావరణం ఉంటే తప్ప బౌలర్లు ఒకే ప్రాంతాల్లో బంతులు వేయకుండా అడ్డుకోవాలి. వారు లెంగ్త్ మార్చుకునేలా దూకుడుగా కనబర్చాలి. పరీక్షించే పరిస్థితుల్లో ఔటవ్వడం గురించి ఆలోచించొద్దు. పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి. అలా చేస్తేనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలం. లేదంటే ఔటవ్వకుండా ఉండాలని కోరుకోవడమే మిగులుతుంది. న్యూజిలాండ్ తరహా నాణ్యమైన బౌలింగ్లో అనుగుణమైన రిస్క్ను తీసుకోవడం ముఖ్యం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఓవర్నైట్ స్కోరు 64/2తో బుధవారం ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (88 బంతుల్లో 41) టాప్ స్కోరర్గా నిలవగా, సౌతీ 4 వికెట్లతో దెబ్బ తీశాడు. అనంతరం మిగిలిన 53 కనీస ఓవర్లలో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (89 బంతుల్లో 52 నాటౌట్), రాస్ టేలర్ (100 బంతుల్లో 47 నాటౌట్) మూడో వికెట్కు 96 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. మ్యాచ్లో 7 వికెట్లు తీసిన జేమీసన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.