
సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు రెండో రోజు కూడా ఆటంకం కలిగింది. శనివారం 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సెకండ్ సెషన్ చివర్లోనే మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో అంపైర్లు ముందుగానే టీ బ్రేక్ ఇచ్చారు. ఇక చివరి సెషన్ ఆరంభంలో వెలుతురులేమితో మరో రెండుసార్లు అంతరాయం కలిగింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఇక ఎంతగానో ఎదురు చూసిన ఈ మ్యాచ్ ఎట్టకేలకు ఆరంభమైనా పదే పదే అంతరాయం కలగడంతో అభిమానులు చికాకు గురయ్యారు. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో టీఆర్పీ రేటింగ్స్ పడిపోయాయి.
మాములుగా భారత్ మ్యాచ్ జరిగితే డిస్నీ+హాట్ స్టార్లో 25 నుంచి 30 లక్షల మంది వీక్షిస్తారు. కానీ శనివారం మ్యాచ్ ఆరంభమైన తర్వాత హాట్స్టార్లో వీక్షకుల సంఖ్య ఏ దశలోనూ 15 లక్షలు దాటలేదు. అంటే వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందో లేదోననుకున్నారో? మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలియదో? లేక ఆడుతూ ఆగుతూ మ్యాచ్ సాగుతుండటంతో లైట్ తీసుకున్నారో తెలియదు కానీ ప్రేక్షాకాదరణ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక టీవీ ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి కనబర్చినట్లు లేదు. పదే పదే మ్యాచ్ ఆగుతుండటంతో అందరూ చానెళ్లు మార్చేసారు. పైగా పిచ్ పూర్తిగా బౌలింగ్కు అనుకూలిస్తుండటం.. పరుగులు చేయడానికి బ్యాట్స్మెన్ తడబడటం కూడా టీఆర్పీ రేటింగ్స్పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఫైనల్ ఒత్తిడి ఆటగాళ్ల కంటే అభిమానులపైనే ఎక్కువగా ఉందని, నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బౌలర్లు దాడి చేస్తుంటే భారత బ్యాట్స్మెన్ ఎక్కడ ఔటవుతారోననే భయంతో కూడా లైవ్ చూడటం ఆపేసామని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. ఇది కూడా టీఆర్పీ రేటింగ్స్ పడిపోవడానికి కారణమైంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (124 బంతుల్లో 1 ఫోర్తో 44 బ్యాటింగ్), అజింక్యా రహానే (79 బంతుల్లో 4 ఫోర్లతో 29 బ్యాటింగ్) ఉన్నారు. చతేశ్వర్ పుజారా(8) విఫలమైనా.. రోహిత్ (34), గిల్ (28) ఆకట్టుకున్నారు. బ్యాటింగ్కు ప్రతికూలంగా మారిన పిచ్పై కింగ్ కోహ్లీ అదరగొట్టాడు. తనకే సాధ్యమైన ఆటతీరుతో అలరించాడు. ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. మరీ ఈ రోజైన ఆట సజావుగా సాగుతోందో లేదో చూడాలి.