
సౌతాంప్టన్: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఎట్టకేలకు మొదలైంది. వర్షం కారణంగా టాస్ పడకుండానే తొలి రోజు తుడిచిపెట్టుకోగా.. రెండో రోజు కాస్త విశ్రాంతి ఇవ్వడంతో ఆట మొదలైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వాతావరణ పరిస్థితులు, పిచ్పై గ్రాస్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. వికెట్ నిలకడగా పేస్ అనుకూలించనున్న నేపథ్యంలో తాము స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
ఇక టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకుందామనుకున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కానీ పరుగులు చేయడమే తమ బలమని, ఈ సవాల్ స్వీకరిస్తామని తెలిపాడు. మెగా ఫైనల్లో భారీ పరుగులు చేస్తే అడ్వాంటేజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అన్ని పరిస్థితులకు ఆడగలిగే కాంబినేషన్తోనే బరిలోకి దిగుతున్నామని, ప్రణాళికల ప్రకారం రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక వర్షంతో మారిపోయిన పరిస్థితుల నేపథ్యంలో తుది జట్టులో మార్పులు జరుగుతాయని ప్రచారం జరిగినా.. కోహ్లీసేన ముందుగా ప్రకటించిన జట్టుతోనే బరిలోకి దిగింది.
అయితే భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుండగా.. కివీస్ మాత్రం పూర్తిగా పేసర్లతోనే ఆడుతుండటం విశేషం. మరీ ఎవరి నిర్ణయం సరైందోననేది మ్యాచ్ ఫలితంతోనే తేలనుంది.
ఈ ఫైనల్ సమరంలో ఇరు జట్లు హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుండగా.. తొలి ఐసీసీ టైటిల్ అందుకోవాలని కోహ్లీ ఉవ్విళ్లురుతున్నాడు. మరోవైపు ఫైనల్లో తమకు అలవాటుగా మారిన తడబాటుకు స్వస్తీ పలకాలని కేన్ విలియమ్సన్ భావిస్తున్నాడు. మరీ క్రికెట్ రారాజుగా ఎవరు నిలుస్తారో? అనేది మరో కొన్ని రోజుల్లో తేలనుంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్:
టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బీజే వాట్లింగ్, కోలిన్ డీ గ్రాండ్ హోమ్, కైల్ జెమీసన్, నీల్ వాగ్నర్, టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్