WTC Final: ఇంగ్లండ్ గడ్డపై ఇండియా ఫైనల్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..?

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు రంగం సిద్దమైంది. మరో రెండు రోజుల్లో ఈ మహాసంగ్రామానికి తెరలేవనుంది. క్రికెట్ రారాజు ఎవరో తేలనుంది. ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ టైటిల్ పోరులో న్యూజిలాండ్, భారత్ తలపడనున్న విషయం తెలిసిందే. ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కావడం, రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో ఈ మెగా ఫైనల్ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలోనే భారత అభిమానులు జట్టుకు సంబంధించిన ప్రతీ విషయాన్ని పరిశీలిస్తున్నారు. న్యూజిలాండ్తో ఐసీసీ ఈవెంట్లలో భారత్కు మెరుగైన రికార్డు లేకున్నా.. ఓ రికార్డు మాత్రం భారత అభిమానులకు ఉపశమనాన్ని అందిస్తోంది. అదేంటంటే.. ఇంగ్లండ్ గడ్డపై భారత్ ఆడిన ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ ఫలితాలు మెరుగ్గా ఉండటం.
ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు ఇప్పటి వరకు మూడు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్స్ ఆడగా రెండింటిలో గెలిచి ఒక్కదాంట్లోనే ఓడిపోయింది. గెలిచిన మ్యాచ్లు కూడా భారత క్రికెట్ చరిత్రకు ఓ నాందీగా నిలిచాయి. ఈ లెక్కన ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ కూడా భారత్ వశం అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ భారత్ గెలిచిన.. ఓడిన ఆ ఐసీసీ టోర్నీలు ఎంటో చూద్దాం.

1983 ప్రపంచకప్..
భారత్.. ఫస్ట్ గెలిచిన 1983 ప్రపంచకప్ ఇంగ్లండ్ వేదికగానే జరిగింది. ఈ విజయం భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు.. అద్భుత ప్రదర్శనతో అదరగొడుతూ ఫైనల్ చేరింది.
టైటిల్ ఫైట్లో పటిష్ట వెస్టిండీస్ను 43 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కపిల్ సేన.. 54.4 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది.(అప్పట్లో వన్డేలు 60 ఓవర్లు ఆడించేవారు). స్వల్ప స్కోర్నైనా భారత్ అద్భుతంగా కాపాడుకుంది. భారత పేసర్లు మదన్ లాల్(3/31), మోహిందర్ అమర్నాథ్ (3/12) రాణించడంతో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.

2013 చాంపియన్స్ ట్రోఫీ..
ఆ తర్వాత మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై 2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాన్నందుకుంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ టైటిల్ ఫైట్లో భారత్ 5 పరుగులతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 129 పరుగులే చేసింది. శిఖర్ ధావన్(31), విరాట్ కోహ్లీ(43), రవీంద్ర జడేజా(33 నాటౌట్) రాణించారు.
అనంతరం ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులే చేసింది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే 18 ఓవర్లో ఇషాంత్ శర్మ వరుస బంతుల్లో ఇయాన్ మోర్గాన్, రవి బొపారా ఔట్ చేయడం.. చివరి ఓవర్లో అశ్విన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ విజయాన్నందుకుంది.

2017 చాంపియన్స్ ట్రోఫీ..
ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం భారత్ ఓటమిపాలైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో కోహ్లీసేన చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 4 వికెట్లకు 338 రన్స్ చేసింది. ఫకార్ జమాన్ సెంచరీతో చెలరేగాడు.
అయితే బుమ్రా బౌలింగ్లో ఫకార్ ఆరంభంలోనే ఔటైనప్పటికీ.. అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఇది భారత్ పతనాన్ని శాసించింది. అనంతరం మహ్మద్ అమీర్(3/16) చెలరేగడంతో టీమిండియా 158 పరుగులకే ఆలౌటై 180 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications