
1983 ప్రపంచకప్..
భారత్.. ఫస్ట్ గెలిచిన 1983 ప్రపంచకప్ ఇంగ్లండ్ వేదికగానే జరిగింది. ఈ విజయం భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు.. అద్భుత ప్రదర్శనతో అదరగొడుతూ ఫైనల్ చేరింది.
టైటిల్ ఫైట్లో పటిష్ట వెస్టిండీస్ను 43 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కపిల్ సేన.. 54.4 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది.(అప్పట్లో వన్డేలు 60 ఓవర్లు ఆడించేవారు). స్వల్ప స్కోర్నైనా భారత్ అద్భుతంగా కాపాడుకుంది. భారత పేసర్లు మదన్ లాల్(3/31), మోహిందర్ అమర్నాథ్ (3/12) రాణించడంతో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.

2013 చాంపియన్స్ ట్రోఫీ..
ఆ తర్వాత మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై 2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాన్నందుకుంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ టైటిల్ ఫైట్లో భారత్ 5 పరుగులతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 129 పరుగులే చేసింది. శిఖర్ ధావన్(31), విరాట్ కోహ్లీ(43), రవీంద్ర జడేజా(33 నాటౌట్) రాణించారు.
అనంతరం ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులే చేసింది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే 18 ఓవర్లో ఇషాంత్ శర్మ వరుస బంతుల్లో ఇయాన్ మోర్గాన్, రవి బొపారా ఔట్ చేయడం.. చివరి ఓవర్లో అశ్విన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ విజయాన్నందుకుంది.

2017 చాంపియన్స్ ట్రోఫీ..
ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం భారత్ ఓటమిపాలైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో కోహ్లీసేన చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 4 వికెట్లకు 338 రన్స్ చేసింది. ఫకార్ జమాన్ సెంచరీతో చెలరేగాడు.
అయితే బుమ్రా బౌలింగ్లో ఫకార్ ఆరంభంలోనే ఔటైనప్పటికీ.. అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఇది భారత్ పతనాన్ని శాసించింది. అనంతరం మహ్మద్ అమీర్(3/16) చెలరేగడంతో టీమిండియా 158 పరుగులకే ఆలౌటై 180 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.


Click it and Unblock the Notifications
