
గిల్కు మరో చాన్స్..
అలా చారిత్రాత్మక సిరీస్ విజయంలో భాగమైన గిల్ ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లోనూ పాల్గొన్నాడు. అయితే ఆ సిరీస్లో గిల్ అంచనాలను అందుకోలేకపోయాడు. ఐపీఎల్ 2021 సీజన్లోనూ విఫలమయ్యాడు. అయినా గిల్ ఆటపై నమ్మకముంచిన బీసీసీఐ కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్కు ఎంపిక చేసింది. మయాంక్ అగర్వాల్తో పోటీ ఉన్నా.. రోహిత్ శర్మకు జతగా గిల్ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

విరాట్, రోహిత్ టిప్స్ ఇవే..
ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానెల్తో మాట్లాడిన గిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'విరాట్ కోహ్లీతో ఎప్పుడు మాట్లాడినా.. బెరుకు లేకుండా ఎలా ఆడాలో చెప్తుంటాడు. అలానే బ్యాటింగ్కు వెళ్లేటప్పుడు పాజిటివ్ మైండ్సెట్తో ఉండాలని సూచించేవాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఎలా ఆడాలో నేర్పిస్తుంటాడు. మైదానంలో తెగించి ఆడాల్సిన సందర్భాల్ని కూడా రోహిత్ శర్మ గుర్తు చేసేవాడు. ప్రత్యర్థి బౌలర్లు ఏ ప్రదేశంలో ఎక్కువ బంతులు వేస్తున్నారు..? అనే దానిపై రోహిత్ శర్మ ఎక్కువగా మైదానంలో మాట్లాడుతుండేవాడు'అని చెప్పుకొచ్చాడు. కాగా 2019లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన గిల్ 7 టెస్టుల్లో 378 పరుగులు.. 3 వన్డేల్లో 49 పరుగులు సాధించాడు.

చూసుకొని ఆడాల్సిందే..
ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ప్రతి సెషన్లో మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆటను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని శుభ్మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. "ఆసీస్లో మేము మెరుగ్గా ఆడాం. విదేశాల్లో టీమ్ఇండియా బాగానే ఆడుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు మా సన్నద్ధత సరిపోలేదని అనుకుంటున్నాను. ఇంగ్లండ్ పర్యటనలో ప్రతి సెషన్కు మెరుగ్గా ఆడడం ముఖ్యం. ఇక్కడ మాత్రమే కాదు.. విదేశీ పిచ్లపై ప్రతి సెషన్ను చూసుకొని ఆడాలి. సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంగ్లాండ్లో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు పిచ్ బంతి స్వింగ్ అవుతుంది. అదే సూర్యరశ్మి పడగానే బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ఈ వాతావరణ పరిస్థితుల పట్ల అవగాహన రావడం చాలా అవసరం" అని గిల్ పేర్కొన్నాడు.

కఠిన క్వారంటైన్ షురూ..
న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా యూకే పర్యటనకు వెళ్తోంది. ఈ టూర్ కోసం టీమిండియా ఆటగాళ్లు ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బయోబుడగలోకి వెళ్లిపోయారు. వీరిలో ముంబై మినహా ఇతర నగర క్రికెటర్లు మే 19నుంచే 14రోజులు నిర్బంధంలోకి వెళ్లగా.. సోమవారం ముంబైకి చెందిన కోహ్లీ సహా మిగతా ఆటగాళ్లు ఏడు రోజుల క్వారంటైన్లోకి అడుగుపెట్టారు. అయితే వీరందరి కోసం ఇక్కడి నుంచి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేవరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. జూన్ 18-22వరకు ఛాంపియన్షిప్ ఫైనల్, ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14వరకు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ జరగనుంది.


Click it and Unblock the Notifications
