
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత ఓటమికి రవీంద్ర జడేజానే కారణమని తెలిపాడు. అతన్ని తుది జట్టులోకి తీసుకోని టీమిండియా మూల్యం చెల్లించుకుందన్నాడు. పేసర్లకు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో జడేజాను తీసుకోవడం భారత అవకాశాలను దెబ్బతీసిందని వివరించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో షోలో.. భారత ఓటమిని విశ్లేషించిన సంజయ్ మంజ్రేకర్.. జడేజా స్థానంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారిని తీసుకుంటే ఆశించిన ఫలితం దక్కేదని అభిప్రాయపడ్డాడు.
'ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందే ప్రకటించిన భారత జట్టును పరిశీలిస్తే.. ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకోవడం ఎప్పటికీ చర్చనీయాంశమే. ఎందుకంటే సౌతాంప్టన్లో వాతావరణం చల్లగా ఉంది. ఆకాశం మేఘావృతమైంది. పైగా టాస్ ఒకరోజు ఆలస్యమైంది. అయినా కోహ్లీసేన ఒక ఆటగాడిని కేవలం బ్యాటింగ్ కోసమే తీసుకుంది. అతనే రవీంద్ర జడేజా. అతన్ని ఎంపిక చేయడానికి ఎడమ చేతివాటం స్పిన్ అసలు కారణమే కాదు. అందుకే నేను ఈ నిర్ణయానికి వ్యతిరేకం' అని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.
'జట్టులో ఎప్పుడైనా స్పెషలిస్టు ఆటగాళ్లనే ఎంపిక చేయాలి. వాతావరణం పొడిగా ఉండి, పిచ్ టర్న్ అవుతుంటే అశ్విన్తో పాటు ఎడమచేతి వాటం స్పిన్నరైన జడేజాను తీసుకుంటే అర్థముండేది. కేవలం బ్యాటింగ్ కోసమే అతన్ని ఎంపిక చేశారు. నిజానికి ఈ నిర్ణయమే టీమిండియాను దెబ్బకొట్టింది. ఉదాహరణకు స్పెషలిస్టు బ్యాట్స్మన్ విహారిని తీసుకుంటే బంతిని డిఫెండ్ చేసేవాడు. అతని టెక్నిక్ బాగుంటుంది. బహుశా అతనుంటే 170 పరుగులు కాస్తా 220, 230గా మారేవేమో.. ఎవరికి తెలుసు! ఇంగ్లండ్ సిరీసులో మాత్రం ఇలాంటి తప్పులు పునరావృతం చేయవద్దు' అని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు.
రవీంద్ర జడేజాకు వ్యతిరేకంగా సంజయ్ మంజ్రేకర్ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. వీరి మధ్య గత కొంత కాలంగా మాటల యుద్దం నడుస్తూనే ఉంది. జడ్డూను బిట్స్ అండ్ పీసెస్ అని మంజ్రేకర్ సంభోదించడం.. దానికి అతను ఘాటుగా.. 'నీ నోటి విరేచనాలు అపాలని'బదులివ్వడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఈ తరహా ప్రవర్తన కారణంగానే బీసీసీఐ మంజ్రేకర్ను కామెంటేటర్గా పక్కనపెట్టింది. దాంతో అతను టీవీ షోలకే పరిమితమయ్యాడు.