
సౌతాంప్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నెట్ సెషన్లో కొత్త అవతారం ఎత్తాడు. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ నేపథ్యంలో.. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్కు సహకరించాడు. శుక్రవారం ఆటకు ముందు నెట్స్లో ప్రాక్టీస్ చేసిన హిట్ మ్యాన్ రోహిత్కు.. విరాట్ బంతితో త్రోడౌన్స్ చేశాడు. రకరకాల బంతులు వేస్తూ టీమ్మేట్కు సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ లాంగ్ ప్రాక్టీస్ సెషన్లో ఇద్దరూ చాలా సేపు బ్యాటింగ్పై డిస్కషన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే క్రమంలో రోహిత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే ఇంగ్లండ్ గడ్డపై మాత్రం 2014లో ఏకైక టెస్ట్ మాత్రమే ఆడిన హిట్ మ్యాన్ 34 రన్స్ మాత్రమే చేశాడు. ఈ చాంపియన్షిప్లో హిట్ మ్యాన్ 11 టెస్ట్లు ఆడి 64.37 యావరేజ్తో 1030 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. అయితే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ను గెలవాలంటే ఓపెనర్లు చాలా కీలకమని ఇప్పటికే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. దాంతో రోహిత్, గిల్పై భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇక ఈ మెగా ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మొదలవ్వాల్సిన ఫైనల్ మ్యాచ్కు భారీ వర్షం అడ్డుపడింది. దీంతో తొలి రోజు ఆట పూర్తిగా రద్దయింది. భారీ అంచనాలున్న ఈ మ్యాచ్లో కనీసం టాస్కు కూడా వాన దేవుడు చాన్స్ ఇవ్వలేదు. ఎడతెరిపి లేని వానకు తోడు బ్యాడ్ లైట్ వల్ల అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఈ రోజు మ్యాచ్ సమయానికి కల్లా వర్షం ఉండదని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దాంతో ఈ రోజు ఆట ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్కు ఐసీసీ రిజర్వ్ డేను కూడా కేటాయించింది.