
సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు రంగం సిద్దమైంది. జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ టైటిల్ పోరు జరగనుంది. అయితే కరోనా దృష్ట్యా ఈ మెగా మ్యాచ్కు పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించనున్న విషయం తెలిసిందే. 4 వేల మంది ప్రేక్షకులను అనుమతిస్తామని హాంప్షైర్ కౌంటీ క్లబ్ ప్రకటించింది. అయితే 4వేల టికెట్లలో ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం వరకు టికెట్లు పోగా.. మరో 2000 టికెట్లను అమ్మకానికి ఉంచుతామని హాంప్ షైర్ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్ గ్రోవ్ తెలిపాడు.
దాంతో టికెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మెగా ఫైట్ మ్యాచ్ కోసం భారత అభిమానులతో పాటు న్యూజిలాండ్ ఫ్యాన్స్ ఎగబడటంతో టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్క టికెట్ ధర గరిష్టంగా రూ.2 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్కు కూడా దారి తీసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ట్విటర్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. 2019 సెప్టెంబర్ తర్వాత ఫ్యాన్స్ను అనుమతించడం ఇదే తొలిసారి కావడంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు డిమాండ్ పెరిగింది. క్రికెట్ మ్యాచ్లు చూసి చాలా రోజులు కావడంతో ఇంగ్లండ్ అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్ట్ల సిరీస్ కోసం టీమిండియా జూన్ 2న ప్రత్యేక విమానంలో యూకేకు వెళ్లనుంది. ఇప్పటికే ముంబైలోని ఒక హోటల్లో బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో బబుల్లో జట్టు సభ్యులంతా హార్డ్ క్వారంటైన్ పాటిస్తున్నారు. మే 14 నుంచి ఈ కఠిన క్వారంటైన్ మొదలైంది. సౌతాంప్టన్ చేరుకున్న తర్వాత భారత జట్టు మూడు రోజుల కఠిన క్వారంటైన్తో పాటు మరో ఏడు రోజులు సాఫ్ట్ క్వారంటైన్లో ఉండనుంది. సాఫ్ట్ క్వారంటైన్లో ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు ఫిట్నెస్ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. బయో బబుల్లో ప్రత్యేక జాగ్రత్తలతో ఏర్పాటు చేసిన జిమ్లో క్రికెటర్లంతా చెమటోడ్చారు. ఇందుకు సంబంధించి బీసీసీఐ బుధవారం ఓ వీడియోను విడుదల చేసింది. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ తదితరులు రకరకాల ఎక్స్ర్సైజ్లు చేయడం ఆ వీడియోలో కనిపించింది.