
కోహ్లీసేనదే లీడ్..
టెస్ట్ క్రికెట్లో ఇరు జట్ల ముఖా ముఖి పోరు రికార్డులు గమనిస్తే కోహ్లీసేనదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 59 మ్యాచ్లు ఆడగా.. టీమిండియా 21 విజయాలు సాధించింది. న్యూజిలాండ్ 12 మ్యాచ్ల్లో గెలవగా 26 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఆటగాళ్ల పరంగా భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్ కివీస్పై దుమ్మురేపాడు. 15 మ్యాచ్ల్లో 1659 రన్స్ చేశాడు. కివీస్ నుంచి బ్రెండన్ మెకల్లమ్కు మెరుగైన రికార్డు ఉంది. అతను 10 మ్యాచ్ల్లో 1224 రన్స్ చేశాడు. ఈ తరం ఆటగాళ్లలో విరాట్ కోహ్లీకి మెరగైన రికార్డు ఉంది. అతను కివీస్పై ఇప్పటికే 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 773 రన్స్ చేశాడు. న్యూజిలాండ్లో రాస్ టేలర్కు భారత్పై మంచి రికార్డు ఉంది. అతను 812 రన్స్ చేశాడు. అయితే గతేడాది ఆరంభంలో న్యూజిలాండ్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్లో భారత్ చిత్తుగా ఓడింది.

అశ్విన్ మాయాజాలం..
2012లో మన హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా చివరిసారిగా న్యూజిలాండ్పై ఇన్నింగ్స్ 115 రన్స్ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 438 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులోకి కొత్తగా వచ్చిన చతేశ్వర్ పుజారా (306 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్తో 159) సెంచరీతో రాణించగా.. ధోనీ(147 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 73), కోహ్లీ(107 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో మెరిసారు. అనంతరం రవిచంద్రన్ అశ్విన్(6/31) మయాజాలంతో తొలి ఇన్నింగ్స్లో కివీస్ 159 పరుగులకే పరిమితమైంది. జేమ్స్ ఫ్రాంక్లిన్(122 బంతుల్లో 43) మినహా అంతా విఫలమయ్యారు. దాంతో సెకండ్ ఇన్నింగ్స్కు దిగిన కివీస్ను అశ్విన్(6/54) మరోసారి దెబ్బతీశాడు. అతని ధాటికి కేన్ విలియమ్సన్(163 బంతుల్లో 52) మినహా అంతా పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో భారత్ ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయాన్నందుకుంది.

బ్యాట్స్మెన్ అంతా చెలరేగిన వేళ..
2010లో నాగ్పూర్ వేదికగా జరిగిన టెస్ట్లో కూడా టీమిండియా ఇన్నింగ్స్ 198 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. న్యూజిలాండ్పై భారత్కు ఇదే అతిపెద్ద విజయం.
ఈ సారి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ తొలి ఇన్నింగ్స్లో 193 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు ఇషాంత్ శర్మ (4/43), ప్రజ్ఞాన్ ఓజా (3/57) చెలరేగడంతో కివీస్ బ్యాట్స్మెన్ క్రీజులో నిలవలేకపోయారు. జెస్సీ రైడర్ (59), బ్రెండన్ మెక్కలమ్ (40), టిమ్ సౌథీ (38)మినహా అంతా విఫలమయ్యారు.
అనంతరం భారత్ 8 వికెట్లకు 566 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు గౌతం గంభీర్ (78), వీరేంద్ర సెహ్వాగ్ (74)తో పాటు వన్డౌన్ బ్యాట్స్మన్ రాహుల్ ద్రవిడ్ ( 396 బంతుల్లో 21 ఫోర్లతో 191) సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. వీరికి అండగా.. సచిన్ (61), ధోనీ (98) సైతం హాఫ్ సెంచరీలతో రాణించడం భారీ స్కోర్ నమోదైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఇషాంత్( 3/15), హర్భజన్ (3/56), రైనా (2/1), ఓజా (2/67) సమష్టిగా రాణించడంతో కివీస్ 175 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

వినూ మన్కడ్ విజయం..
ఇక 1956లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్పై టీమిండియా ఇన్నింగ్స్ 109 పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్పై భారత్కు ఇదే తొలి గొప్ప విజయం. పాలీ ఉమ్రిగర్ నేతృత్వంలోని భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లే కోల్పోయి 537 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు వినూ మన్కడ్ (231), పంకజ్రాయ్ (173) తొలి వికెట్కు 413 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. అది 52 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యుత్తమ తొలి వికెట్ భాగస్వామ్యంగా నిలిచింది. ఆపై కెప్టెన్ ఉమ్రిగర్ (79), గుల్బారాయ్ రామ్చంద్ (21) పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. అనంతరం భారత బౌలర్లు శుభాష్ గుప్తె (5/72), జసుభాయ్ పటేల్ (3/63) రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్లో 219 పరుగులకే కుప్పకూలింది. శుభాష్ (4/73), వినూ మన్కడ్ (4/65) కివీస్ పతనాన్ని శాసించారు.


Click it and Unblock the Notifications
