10 రోజుల ఐసోలేషన్..
ఇంగ్లండ్ చేరుకున్న తర్వాత మరో 10 రోజుల పాటు ఐసోలేషన్ పాటించనున్నారు. అయితే ఈ ఐసోలేషన్లో ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. జూన్ 2న భారత జట్లు ఇంగ్లండ్ చేరనున్నాయి. 10 రోజుల ఐసోలేషన్ను జూన్ 12న పూర్తి చేసుకోనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకురానుంది. ఇక ముంబైలోనే ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఓపెనర్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రవిశాస్త్రి వచ్చే వారం హోటల్ ఏర్పాటు చేసిన బయో బబుల్లో చేరనున్నారు.
మూడు సార్లు టెస్ట్..
ఈ బబుల్లో మహిళా, పురుష క్రికెటర్లకు మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా కరోనా బారిన పడిన వృద్దిమాన్ సాహా, ప్రసిధ్ కృష్ణలు ప్రస్తుతం కోలుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే వారు బయో బబుల్లో కలవనున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యూకే ప్రభుత్వం భారత్ను రెడ్లిస్ట్లో పెట్టింది. భారత విమానాలపై నిషేధం విధించింది. దాంతో ఆటగాళ్ల ఫ్యామిలీలను తీసుకెళ్లడం సమస్యగా మారింది. దీనిపై బీసీసీఐ..బ్రిటీష్ అధికారులతో మంతనాలు జరుపుతోంది. అయితే ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్ పాటించనున్నారు.
జూన్ 18 నుంచి..
టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య 5 టెస్టుల సిరీస్లో కోహ్లీసేన పాల్గొంటుంది. మహిళల జట్టు ఇంగ్లండ్తో జూన్ 16-19 వరకు బ్రిస్టల్లో నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 27న బ్రిస్టల్ మొదటి వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. రెండవ వన్డే (డే-నైట్) జూన్ 30న టౌంటన్లో జరుగుతుంది. ఇక చివరిదైన మూడవ వన్డే జూన్ 3న జరుగుతుంది. మొదటి టీ20 మ్యాచ్ జూలై 9న నార్తాంట్స్లో, రెండో టీ20 జూలై 11 హోవ్లో, మూడో టీ20 జూలై 15న చెల్మ్స్ ఫోర్డ్లో జరగనున్నాయి.