
సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ డ్రా దిశగా సాగుతోంది. ఐదో రోజు ఆటలో తొలి రెండు సెషన్లు ఆధిపత్యం కనబర్చిన టీమిండియా.. ఆఖరి సెషన్లో మాత్రం ఓపెనర్లు రోహిత్ శర్మ(30), శుభ్మన్ గిల్(8) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమ్ సౌథీ(2/17) ఓపెనర్లిద్దరినీ ఔట్ చేయడంతో ఐదో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకండ్ ఇన్నింగ్స్లో 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 64 రన్స్ చేసింది. క్రీజులో చతేశ్వర్ పుజారా(55 బంతుల్లో 12 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (12 బంతుల్లో 8) ఉన్నారు.
ప్రస్తుతం భారత్ కివీస్ కన్నా 32 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. రిజర్వ్ డే అయిన బుధవారం కోహ్లీసేన కేర్ఫుల్గా ఆడకుండా వికెట్లు పారేసుకుంటే మాత్రం న్యూజిలాండ్కు విజయవకాశాలుంటాయి. వికెట్లు చేజార్చుకోకుండా ఫస్ట్ సెషన్ ముగించినా.. వర్షంతో ఆటకు అంతరాయం కలిగినా.. అక్కడికే మ్యాచ్ను నిలిపివేసి ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.
అంతకుముందు న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 99.2 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. డేవాన్ కాన్వే(54), కేన్ విలియమ్సన్(49), టామ్ లాథమ్(30), టీమ్ సౌథీ(30),జెమీసన్(22) రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(4/76) నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఇషాంత్ శర్మ(3/48) మూడు, రవిచంద్రన్ అశ్విన్(2/28) రెండు, జడేజా ఓ వికెట్ తీశారు.
101/2 ఓవర్నైట్ స్కోర్తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్పై భారత్ బౌలర్లు ఎదురు దాడికి దిగారు. ఫస్ట్ సెషన్ సెకండాఫ్లో రాస్ టేలర్ను ఔట్ చేసిన షమీ టీమిండియాకు బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత కివీస్ హెన్రీ నికోల్స్, బీజే వాట్లింగ్ వికెట్లను వరుసగా కోల్పోయింది. దాంతో కివీస్ 135/5తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. అనంతరం గ్రాండ్ హోమ్ ఔటవ్వగా.. జెమీసన్ ధాటిగా ఆడాడు. ఇది భారత అవకాశాలను దెబ్బతీసింది.
విలియమ్సన్ ఔటైనా.. చివర్లో సౌథీ రెండు సిక్స్లతో 30 రన్స్ చేయడంతో కివీస్కు 32 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక మూడో సెషన్లో బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ సైతం ఔటయ్యాడు. ఈ ఇద్దరిని టీమ్ సౌథీ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ ఆత్మరక్షణలో పడింది. పుజారా, కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఐదో రోజును ముగించారు.