WTC Final 2021:టీమిండియాను ఓడించినంత మాత్రాన.. భారత అభిమానులకు మేం చెడ్డవాళ్లమైపోము!!

సౌథాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్ గెలవడం చాలా ఆనందంగా ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. తన క్రికెట్ కెరీర్లో ఇదో ప్రత్యేక అనుభూతిగా పేర్కొన్నాడు. టీమిండియాను ఓడించినంత మాత్రాన భారత అభిమానులకు తాము చెడ్డవాళ్లమైపోమని, బహుశా వారికి మాపై ఇష్టం మారదనే అనుకుంటున్నా అని కేన్ తెలిపాడు.
అంచనాలకు మించి రాణించిన న్యూజిలాండ్ ఆరంభ డబ్ల్యూటీసీ విజేతగా నిలిచింది. అర్ధ శతకంతో అదరగొట్టిన విలియమ్సన్ (89 బంతుల్లో 8 ఫోర్లతో 52 నాటౌట్).. రాస్ టేలర్ (47 నాటౌట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వర్షం అడ్డంకులు సృష్టించడంతో రిజర్వు డే అయిన ఆరో రోజు మ్యాచ్ను కొసాగించడం ఫలితాన్నిచ్చింది.

స్టార్లు ఉండరనే మేం భావిస్తాం
మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భావోద్వేగం చెందాడు. 'కొంతకాలంగా నేను కివీస్ జట్టులో భాగమయ్యాను. చరిత్రలో తొలిసారి మేం ప్రపంచ టైటిల్ సాధించాం. ఇదో ప్రత్యేక అనుభూతి. రెండేళ్లుగా 22 మంది ఆటగాళ్లం ఆడాం. అందరూ తమ పాత్రకు న్యాయం చేశారు. ఈ విజయంలో ఘనత సహాయ సిబ్బందికీ దక్కుతుంది. కరోనా సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని పనులు చేశారు. మా జట్టులో ఎప్పుడూ స్టార్లు ఉండరనే మేం భావిస్తాం. అందుకే మ్యాచులో పోటీనిచ్చేందుకు, నిలకడగా రాణించేందుకు అవకాశం ఉన్నవారినే తీసుకుంటాం' అని కేన్ తెలిపాడు.

శిఖర సమానమైన విజయమే
'డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవడం శిఖర సమానమైన విజయమే. టీమిండియాతో ఫైనల్ ఆడిన వ్యక్తిగా నేనది చెప్పగలను. 2019లోనూ మేం అద్భుతంగా క్రికెట్ ఆడాం. అయితే మాకిప్పుడు అనుకూలంగా ఫలితం రావడంతో కాస్త భిన్నమైన అనుభూతి కలుగుతోంది' అని కేన్ విలియమ్సన్ అన్నాడు. న్యూజిలాండ్ గెలిచిన అతిపెద్ద ఐసీసీ టైటిల్ ఇదే. ఒక్కసారి ఛాంపియన్స్ ట్రోఫీ (2000)ని సొంతం చేసుకోవడం మినహా ఐసీసీ టోర్నీల్లో గెలిచిన రికార్డు లేని కివీస్.. సుదీర్ఘ నిరీక్షణకు ఈ విజయంతో ముగింపు పలికింది. 2015, 2019 ప్రపంచకప్ టోర్నీల్లో ఆ జట్టు ఫైనల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 2019లో న్యూజిలాండ్ను దురదృష్టం వెంటాడింది. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ పోరులో మ్యాచ్ స్కోర్లు సమం కాగా.. సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. దీంతో బౌండరీల తేడాతో ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించడంతో కివీస్కు నిరాశే ఎదురైంది.
WTC Final 2021: ఆహ.. ఏం చిత్రమిది! కోహ్లీ కౌగిలిలో విలియమ్సన్!

వారికీ మేం చెడ్డవాళ్లమైపోము
న్యూజిలాండ్ క్రికెటర్లు మంచోళ్లు అన్న మాటలపై కేన్ స్పందించాడు. 'ప్రజలు వారికిష్టమైన విధంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే ఒక బృందంగా మేం నిజాయతీకి కట్టుబడతాం. మైదానంలో, బయటా మా ప్రవర్తన ఎలా ఉంటుందన్నదీ మాకు ముఖ్యమే. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టును ఓడించినంత మాత్రాన.. టీమిండియా అభిమానులకు మేం చెడ్డవాళ్లమైపోము. వారిలో మాపై ఇష్టం మారదనే అనుకుంటున్నా. బహుశా మేం వారి రెండో ఫేవరెట్ జట్టైనందుకు సంతోషిస్తున్నాం. ఇక మీదటా ఆ అభిమానం అలాగే ఉంటుందని భావిస్తున్నా' అని న్యూజిలాండ్ కెప్టెన్ పేర్కొన్నాడు.

నాణ్యమైన క్రికెట్ ఆడాం
'మంచి క్రీడా స్ఫూర్తి, పోటీతత్వంతో నాణ్యమైన క్రికెట్ ఆడాము. గెలిచేందుకు, ఓడించేందుకు, డ్రా చేసుకొనేందుకు ఆఖరి రోజు పిచ్ ఇరు జట్లలోని అందరికీ సహకరించించింది. టెస్టు ఛాంపియన్షిప్ గెలవడం ఆనందంగా ఉంది. సీనియర్ ఆటగాడైన రాస్ టేలర్ మాతో ఉండటం అదృష్టమని భావిస్తున్నా. జట్టులోని అందరూ కష్టపడ్డారు.
అందుకు ఫలితమే ఈ విజయం' అని కేన్ మామ చెప్పుకొచ్చాడు. 1930లో టెస్టు హోదా దక్కించుకున్న కివీస్ అదే ఏడాది ఇంగ్లండ్తో తన మొట్టమొదటి మ్యాచ్ ఆడింది. దశాబ్దాల నుంచి టెస్టుల్లో కొనసాగుతున్నప్పటికీ ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయించలేకపోయింది. అయితే ఇటీవలి కాలంలో కివీస్ గణనీయమైన ప్రగతి సాధించింది. ముఖ్యంగా కేన్ విలియమ్సన్ సారథిగా బాధ్యతలు చేపట్టాక జట్టు రాతే మారిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications