
హైదరాబాద్: తొలిసారి ఐసీసీ నిర్వహించిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్ గదను న్యూజిలాండ్ దక్కించుకుంది. 2019 వన్డే ప్రపంచకప్లో గెలుపు అంచుల వరకు వెళ్లి భంగపడిన ఇంగ్లండ్ గడ్డపైనే విలియమ్సన్ సేన టెస్టు క్రికెట్ జగజ్జేతగా నిలిచింది. రిజర్వ్ డే అయిన బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన భారత బౌలర్లు, బ్యాట్స్మన్లు తుది మెట్టుపై బోల్తాపడి మూల్యం చెల్లించుకున్నారు. అయితే ఇరు జట్ల సారథులు ఆప్యాయంగా హత్తుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ అండర్-19 నుంచి మంచి స్నేహితులు. వేర్వేరు జట్లకు ఆడుతున్నా.. ప్రత్యర్థులుగా మైదానంలో తలపడుతున్నా.. వారి స్నేహబంధం మాత్రం మరింత బలపడుతూనే ఉంది. ఇద్దరి మధ్య పోటీ ఏమాత్రం ఉండదు.. పరస్పరం గౌరవించుకుంటారు. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం.. మాట్లాడుకోవడం.. ముచ్చట్లు చెపుతూ నవ్వుకోవడం.. అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాంటి చిత్రాలు చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతర చిత్రం మాత్రం అంతకు మించి అని చెప్పాలి.
కోహ్లీ-కేన్ కొన్నేళ్లుగా తమతమ జట్లకు సారథ్యం వహిస్తున్నారు. అంచలంచెలుగా ఎదుగుతూ బలమైన ముద్ర వేశారు. కీలక ఆటగాళ్లుగా ఎదిగారు. కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటేందుకే ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ సారథులే అయినా.. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ మెట్లపై బోల్తా పడటం వారికీ ఇబ్బందిగా మారింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీసేన ఫైనల్లో పాక్ చేతిలో ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసింది. అటు కివీస్ ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ మినహాయిస్తే.. మరే ఐసీసీ టైటిల్ కొట్టేలేదు.
అందుకే కోహ్లీ-కేన్ ఇద్దరికీ ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కీలకంగా మారింది. వర్షం వల్ల చివరి రోజు వరకు ఫైనల్ డ్రా అవుతుందనే అనుకున్నారు. కానీ రిజర్వు డే అయిన మంగళవారం మాత్రం అద్భుతం జరిగింది. టీమిండియాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన న్యూజిలాండ్.. సునాయాస విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. ఐసీసీ గదతో విలియమ్సన్ పోజులిచ్చాడు .ఆపై ఆనందంలో విరాట్ కోహ్లీ కౌగిలిలో ఒదిగిపోయాడు. ఈ ఫొటోనే నెట్టింట వైరల్ అయింది. ఆహ.. ఏం చిత్రమిది అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.