WTC Final:టీమిండియా 250కి పైగా పరుగులు చేస్తే న్యూజిలాండ్కు కష్టమే!

సౌతాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో 250 ప్లస్ పరుగులు చేస్తే మ్యాచ్పై పట్టు బిగించవచ్చని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. సౌతాంప్టన్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అది మెరుగైన స్కోరేనని అభిప్రాయపడ్డారు.
ఓపెనర్లు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ చక్కని భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారని, కోహ్లీ, రహానే అద్భుతంగా రాణించారని కొనియాడాడు. పిచ్ నుంచి లభించిన సహకారంతో కివీస్ బౌలర్లు చెలరేగారని కానీ.. భారత జట్టు అద్భుతంగా పోరాడిందని ప్రశంసించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
'భారత జట్టు ఇంకా వీలైనన్ని మరిన్ని పరుగులు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో 250 ప్లస్ మెరుగైన స్కోరే. కొత్త బంతిని ఓపెనర్లు రోహిత్, శుభ్మన్ చక్కగా ఎదుర్కొన్నారు.'అని చెప్పుకొచ్చాడు. క్రీజు బయట స్టాన్స్ తీసుకుంది స్వింగ్ను ఎదుర్కోవడానికా? దూకుడుగా ఆడటానికా? అని ప్రశ్నించగా.. 'బ్యాటింగ్ అంటేనే పరుగులు చేయడం. రోహిత్, గిల్ పట్టుదలగా ఆడారు. వీలైనప్పుడల్లా పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. వారిని కచ్చితంగా అభినందించాల్సిందే. విరాట్, రహానె బ్యాటింగ్ చేసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే' అని రాథోడ్ అన్నాడు.

త్వరలోనే పుజారా చెలరేగుతాడు..
'ఇంగ్లండ్లో డ్యూక్ బంతులు పాతబడ్డాక మరింత స్వింగ్ అవుతాయి. పైగా రెండో సెషన్లో న్యూజిలాండ్ పేసర్లు కట్టుదిట్టమైన లెంగ్తుల్లో బంతులు వేశారు.' అని విక్రమ్ తెలిపాడు. చెతేశ్వర్ పుజారా హెల్మెట్కు బంతులు తగిలించుకుంటున్నాడని, బ్యాటింగ్ టెక్నిక్లో ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించగా.. 'మేం మరీ అతిగా పట్టించుకోవడం లేదు. అతనో మంచి క్రికెటర్. వేగవంతమైన బంతులు ఆడటం కష్టమని అనుకోను. అతడు బ్యాటింగ్ చేస్తున్నంత సేపు స్థిరంగానే ఉన్నాడు. ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఈ మ్యాచులోనూ 50 బంతులకు పైగా ఆడాడు. వాటిని పరుగులుగా మార్చాలి. త్వరలోనే అది జరుగుతుంది' అని విక్రమ్ రాఠోడ్ ధీమా వ్యక్తం చేశాడు.

కింగ్ కోహ్లీ..
ఈ మెగా ఫైనల్కు ఆటంకాలు తప్పడం లేదు. తొలి రోజు వర్షం కారణంగా ఒక్క బంతి పడకపోగా, రెండో రోజు శనివారం వెలుతురులేమితో 66.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సెకండ్ సెషన్ చివర్లోనే మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో అంపైర్లు ముందుగానే టీ బ్రేక్ ఇచ్చారు. ఇక చివరి సెషన్ ఆరంభంలో వెలుతురులేమితో మరో రెండుసార్లు అంతరాయం కలిగింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (124 బంతుల్లో 1 ఫోర్తో 44 బ్యాటింగ్), అజింక్యా రహానే (79 బంతుల్లో 4 ఫోర్లతో 29 బ్యాటింగ్) ఉన్నారు. చతేశ్వర్ పుజారా(8) విఫలమైనా.. రోహిత్ (34), గిల్ (28) ఆకట్టుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications