
ముంబై: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడేమి ఉండదని యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. జట్టులో అనుభవజ్ఞులైన రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఉన్నారని తెలిపాడు. ఎక్స్ ఫ్యాక్టర్గా భావిస్తున్న రిషభ్ పంత్ సైతం ఉన్నాడని వెల్లడించాడు. విరాట్ కోహ్లీ లేనప్పటికీ ఆసీస్ పర్యటనలో కుర్రాళ్లు అదరగొట్టారని అక్షర్ గుర్తుచేశాడు. టీమిండియా ఏ ఒక్కరిపైనో ఆధారపడదన్నాడు.
'విరాట్ కోహ్లీ ఒక్కడిపైనే ఒత్తిడి ఉండదు. జట్టులో సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా కుర్రాళ్లు ఫామ్లో ఉన్నారు. కోహ్లీ లేకుండానే మన జట్టు ఆసీస్పై టెస్టు సిరీస్ నెగ్గింది. ఇంగ్లండ్ సిరీసులో అతను త్వరగా ఔటైనా రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారు. రోహిత్ సెంచరీలు బాదేశాడు. స్పిన్నర్లు సైతం లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశారు' అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చా.
'ఆస్ట్రేలియాలో శార్దూల్ ఠాకూర్, సుందర్ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఇంగ్లండ్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 400-500 వంటి భారీ స్కోర్లు చేదించాల్సిన అవసరం రాదు. స్కోర్లు 300 లేదా 250 వరకే ఉంటాయి. అందుకే లోయర్ ఆర్డర్ భాగస్వామ్యాలు చాలా అవసరం. పుజారా, కోహ్లీ, రోహిత్, రహానే, పంత్ టాప్ ఆర్డర్లో ఉన్నారు. ఆ ఐదుగురిలో ఏ ఇద్దరు త్వరగా ఔటైనా మిగతా వాళ్లు పని పూర్తి చేయగలరు. భారత జట్టుకు ఆ సత్తా ఉంది. ఏ ఒక్కరి మీదో ఆధారపడదు. ఓపెనర్లు కాకుండా మిడిలార్డర్ లేదంటే లోయర్ ఆర్డర్ ఫలితాలను రాబట్టగలరు' అని అక్షర్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం ముంబై వేదికగా బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్న టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్ పయనం కానుంది. అక్కడ మరో 10 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండనుంది. తొలి మూడు రోజులు హార్డ్ క్వారంటైన్ పాటించనున్న కోహ్లీసేన.. మరో ఏడు రోజుల సాఫ్ట్ క్వారంటైన్లో ఉండనుంది. ఈ ఏడు రోజుల్లో ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది.