
లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ప్రేక్షకుల మధ్యే జరగనుంది. జూన్ 18-22 మధ్య సౌథాంప్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ టైటిల్ పోరు జరగనున్న విషయం తెలిసిందే. అయితే కరోనా దృష్ట్యా ఈ మ్యాచ్కు ప్రేక్షకుల్ని అనుమతిస్తారా? లేదా? అన్న విషయమై సందేహాలు ఉండేవి. కానీ వాటిన్నటికి తెరదించుతూ హాంప్షైర్ కౌంటీ క్లబ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మెగా పోరుకు 4 వేల మంది ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని గురువారం ప్రకటించింది.
యూకేలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నామని హాంప్ షైర్ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్ గ్రోవ్ తెలిపారు. 'హాంప్షైర్ వేదికగా నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్ ఈ రోజు(గురువారం) నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులకు అనుమతి ఇస్తున్నాం. 2019 సెప్టెంబర్ తర్వాత ఫ్యాన్స్ను అనుమతించడం ఇదే తొలిసారి. రేపటి నుంచి మరికొన్ని మ్యాచ్లు మొదలవుతాయి. వాటికీ ప్రేక్షకులు వస్తారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం వరకు టికెట్లు పోగా.. మరో 2000 టికెట్లను అమ్మకానికి ఉంచుతాం. ఇప్పటికే చాలామంది ఈ టికెట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మ్యాచ్కు చాలా డిమాండ్ ఉంది.'అని బ్రన్స్ గ్రోవ్ చెప్పుకొచ్చారు. హాంప్షైర్ వేదికగా ప్రారంభమైన కౌంటీ మ్యాచ్కు 1500 మంది ప్రేక్షకులకు అనుమతిచ్చారు. ఈ వేదికగానే డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్ట్ల సిరీస్ కోసం టీమిండియా జూన్ 2న ప్రత్యేక విమానంలో యూకేకు వెళ్లనుంది. ఇంగ్లండ్ ఫ్లయిట్ ఎక్కడానికి రెండు వారాల ముందునుంచే ముంబైలోని ఒక హోటల్లో జట్టు సభ్యులంతా హార్డ్ క్వారంటైన్లో గడపనున్నారు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం వీరంతా తమ హోటల్ గదులు దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదు. కరోనా కారణంగానే ఐపీఎల్ను వాయిదా వేయాల్సి రావడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు బోర్డు సన్నద్ధమైంది.
ఆటగాళ్ల క్వారంటైన్ బుధవారం నుంచే ప్రారంభమైంది. ముంబైలో క్వారంటైన్లోకి అడుగు పెట్టే ముందు క్రికెటర్లు కనీసం మూడుసార్లు కరోనా నెగెటివ్గా తేలిన రిపోర్టులతో రావాలి. క్వారంటైన్ సమయంలో కూడా కనీసం మరో మూడుసార్లు ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరోవైపు పురుషుల జట్టుతో పాటే ఇంగ్లండ్ వెళ్లనున్న భారత మహిళల జట్టుకు కూడా క్వారంటైన్ విషయంలో ఇవే ప్రొటోకాల్ వర్తింపజేస్తున్నారు. ఈ పర్యటనలో మహిళల టీమ్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఇంగ్లండ్తో తలపడుతుంది. లండన్ చేరిన తర్వాత భారత ఆటగాళ్లు అక్కడ 10 రోజుల ఐసోలేషన్లో ఉండనున్నారు.