
ముంబై: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించాలంటే ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అటు బంతితో ఇటు బ్యాట్తో రాణించగల రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు చోటివ్వాలని టీమ్మేనేజ్మెంట్కు సూచించాడు. ఫైనల్లో తలపడే న్యూజిలాండ్ టీమ్ ఆసియేతర జట్టని, స్పిన్ను సమర్థవంతంగా ఆడలేదని తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.
'నా అభిప్రాయం ప్రకారం రవీంద్ర జడేజా, అశ్విన్ ఇద్దరిని జట్టులోకి తీసుకోవాలి. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్. అది ఆసియా జట్టు కాదు కాబట్టి స్పిన్ను మెరుగ్గా ఆడలేదు. అందుకే ఐదుగురు బౌలర్లలో జడేజా, అశ్విన్కు చోటివ్వాలి. ఇంగ్లండ్ పరిస్థితుల్లో వారిద్దరూ రాణించగలరు. ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులు స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలించవని చాలామంది భావిస్తారు. కానీ యూనిడైమన్షల్ బౌలింగ్ అటాకింగ్ ఉన్నప్పుడు బ్యాటింగ్ సులభంగా చేయడం మనం గమనించాం' అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ ఇప్పటికే ఇంగ్లండ్తో ఓ టెస్టు ఆడింది. మరో టెస్టుకు సిద్ధమవుతోంది. మరోవైపు కోహ్లీసేనకు మాత్రం సాధనకు సరైన సమయం లేకపోవడం గమనార్హం. ఇక టెస్టు చాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా అశ్విన్ నిలిచాడు. 13 మ్యాచుల్లో 67 వికెట్లు తీశాడు. జడేజా 10 మ్యాచుల్లో 28 వికెట్లు తీసి బ్యాటుతోనూ విలువైన పరుగులు చేశాడు.