లండన్: సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ అభిమానుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. తమ అభిమాన ఆటగాళ్ల మీద ఉన్న ప్రేమతో కొందరు అభిమానులు ఒకరిపై మరొకరు విద్వేషం చిమ్ముకుంటున్నారు. వీళ్లంతా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా విజయం కంటే తమకు నచ్చని ఆటగాళ్ల వైఫల్యాన్ని కోరుకుంటున్నారు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా దారుణంగా విఫలమవ్వగా.. ఈ స్టార్ ఆటగాళ్లపై అభిమానులు తీవ్ర ట్రోలింగ్కు దిగారు. రోహిత్ ఫ్యాన్స్ను కోహ్లీ అభిమానులు విమర్శిస్తే.. కోహ్లీ వైఫల్యాన్ని రోహిత్ ఫ్యాన్స్ ఎండగట్టారు. ఇలా సొంత ఆటగాళ్లపై దారుణంగా ట్రోలింగ్ దిగారు.

ఈ విమర్శలను చూసిన అసలు సిసలు అభిమానులు విస్మయపోతున్నారు. ఇదేం అభిమానం రా అయ్యా.. మీ చేతులు తగలేయ్యా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ వైఫల్యం కోసం విరాట్ కోహ్లీ అభిమానులు, విరాట్ వైఫల్యం కోసం రోహిత్ ఫ్యాన్స్, భారత జట్టు వైఫల్యం కోసం ధోనీ అభిమానులు ఎందురు చూస్తున్నారని, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల వాదన అయితే మరోలా ఉందని మండిపడుతున్నారు.
భారత దేశంలోనే చెన్నై వేరే దేశంగా వారు భావిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ తరహా అభిమానం అవసరం లేదని, ఐపీఎల్ ముగిసిన అనంతరం టీమిండియాకు ఆడే ఆటగాళ్లందర్ని అభిమానించాలని, జట్టు విజయాన్ని కోరుకోవాలని సూచిస్తున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. 164/3 ఓవర్ నైట్స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో సెట్ అయిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), రవీంద్ర జడేజా(0) బంతి వ్యవధిలోనే పెవిలియన్ చేరారు.
అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన అజింక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), శార్దూల్ ఠాకూర్(0) పెవిలియన్ చేరారు. దాంతో భారత్ 213 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.