న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా సన్నదమవుతోంది. లండన్లోని ఓవల్ వేదికగా జూన్ 7-11 మధ్య జరగనున్న ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం ఆస్ట్రేలియాకు తొలిసారి కాగా.. టీమిండియాకు రెండోసారి. గత ఎడిషన్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా గెలిచి డబ్ల్యూటీసీ గదను అందుకోవాలనుకుంటుంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే లండన్ చేరి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ జరగనున్న ఓవల్ మైదానంలో టీమిండియాకు గొప్ప రికార్డు ఏం లేదు. ఇప్పటి వరకు 14 మ్యాచ్లు ఆడిన టీమిండియా రెండింటిలో గెలిచి ఏడు డ్రా చేసుకుంది. మరో ఐదింటిలో మాత్రం ఓడింది. అయితే 2021లో చివరిసారిగా ఇక్కడ జరిగిన మ్యాచ్లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.

ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే చాలా దారుణంగా ఉంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడి 28.16 సగటుతో 169 పరుగులే చేశాడు. ఇక్కడ కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 50 పరుగులే... ఈ హాఫ్ సెంచరీ కూడా 2021 ఇంగ్లండ్ పర్యటనలో వచ్చినదే.
పుజారా సైతం మూడు మ్యాచ్లు ఆడి 19.50 సగటుతో 117 పరుగులే చేశాడు. అత్యధిక స్కోర్ 61 పరుగులు. రహానే కూడా ఇక్కడ మూడు టెస్ట్లే ఆడి 55 పరుగులే చేశాడు. యావరేజ్ 9.16గా ఉండటం విశేషం. టీమిండియా బ్యాటింగ్కు బ్యాక్ బోన్ అయిన ఈ ముగ్గురి రికార్డు దారుణంగా ఉండటం ఫ్యాన్స్ను కలవరపెడుతోంది. అయితే ఈ ఓవల్ మైదానంలో రవీంద్ర జడేజాతో పాటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్లకు మెరుగైన రికార్డు ఉంది.
జడేజా 2 మ్యాచ్ల్లో 42 సగటుతో 126 పరుగులు చేసి 11 వికెట్లు తీసాడు. రిషభ్ పంత్కు ఇక్కడ 44.5 సగటు ఉంటే, కేఎల్ రాహుల్ 62.25 యావరేజ్తో పరుగులు చేశాడు. గాయం కారణంగా రాహుల్ డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమైన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ ఓవల్ మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 127 పరుగులు చేశాడు. 2021 ఇంగ్లండ్ పర్యటనలో సెంచరీ చేసిన రోహిత్.. విదేశాల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు.