న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా లండన్ బయల్దేరింది. ఐపీఎల్ 2023 సీజన్లో ప్లే ఆఫ్స్ చేరని జట్లలోని భారత ఆటగాళ్లతో కూడిన ఫస్ట్ బ్యాచ్ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ముంబై విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కింది.
హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్తో పాటు ప్లేయర్లు మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, నెట్ బౌలర్లు అనికేత్ చౌదరి, ఆకాశ్ దీప్, యర్ర పృథ్వీరాజ్ లండన్లో అడుగుపెట్టారు.

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఫస్ట్ బ్యాచ్తోనే లండన్ వెళ్లాల్సి ఉన్నా.. వ్యక్తిగత కారణాలతో రెండు రోజు ఆలస్యంగా వస్తామని బోర్డుకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్స్ ఆడుతున్న భారత ఆటగాళ్లు మే 30లోపు లండన్ బయల్దేరనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. చివరి నిమిషంలో ఆర్సీబీ రేసులో నుంచి తప్పుకుంది.
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మంగళవారం క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుండగా.. బుధవారం ముంబై, లక్నో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. శుక్రవారం క్వాలిఫయర్-2 జరగనుండగా మే 28న జరిగే ఫైనల్తో ఈ ధనాధన్ లీగ్కు తెరపడనుంది. ఓ వైపు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరుగుతుండగానే మరోవైపు టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రిపరేషన్స్ను ప్రారంభించనుంది.
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ ఆడనున్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, మహమ్మద్ షమీ, కేఎస్ భరత్, అజింక్యా రహానే ఆలస్యంగా వెళ్లనున్నారు. ఇప్పటికే లండన్లో ఉన్న చతేశ్వర్ పుజారా భారత జట్టుతో కలవనున్నాడు. జూన్ 7-11 మధ్య లండన్లో ఓవల్ మైదానం వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ కిషన్
స్టాండ్బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.