లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రసవత్తరంగా మారింది. 444 భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(44 బ్యాటింగ్), అజింక్యా రహానే(20 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, నాథన్ లయన్ తలో వికెట్ తీసారు.
టీమిండియా విజయానికి 280 పరుగులు అవసరం కాగా.. ఆస్ట్రేలియా గెలుపునకు ఏడు వికెట్లు కావాలి. చివరి రోజు మూడు సెషన్ల పాటు సాగే ఆటలో 90 ఓవర్లలో 280 పరుగులు చేయడం టీమిండియాకు పెద్ద కష్టమేం కాదు. కానీ విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే సెంచరీలతో చెలరేగితేనే ఇది సాధ్యం అవుతోంది. ముఖ్యంగా ఆదివారం ఫస్ట్ సెషన్లో వికెట్ కోల్పోకుండా ఆడటం చాలా ముఖ్యం.

అయితే టీమిండియా 280 పరుగులు చేయడం కంటే ఆసీస్ 7 వికెట్లు తీయడం చాలా ముఖ్యం. భారత బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబరిస్తే ఇది సాధ్యమవుతోంది. ఆఖరి రోజు అద్భుత ప్రదర్శన కనబర్చిన జట్టునే విజయం వరించనుంది.
444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ను ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ధాటిగా ప్రారంభించారు. రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్లతో అలరించగా.. గిల్ యాంకర్ రోల్ పోషించాడు. 41 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని స్కాట్ బోలాండ్ విడదీసాడు. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా శుభ్మన్ గిల్(18) వెనుదిరిగాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో రోహిత్ అదే జోరును కొనసాగించాడు. పుజారా సైతం తన శైలికి భిన్నంగా ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 51 పరుగులతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నాథన్ లయన్ విడదీసాడు. అనవసరపు షాట్తో రోహిత్ వికెట్ల ముందు దొరికిపోగా.. మరుసటి ఓవర్లోనే పుజారా అప్పర్ కట్ ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. దాంతో 93 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో అజింక్యా రహానే, కోహ్లీ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి బ్యాటింగ్ చేసిన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిచింది. కోహ్లీ హాఫ్ సెంచరీకి చేరువ్వగా భాగస్వామ్యం 71 పరుగులకు చేరింది. చివరి రోజు కూడా ఈ ఇద్దరూ ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియా చారిత్రాత్మక విజయాన్నందుకోవచ్చు.
అంతకుముందు 123/4 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. మిచెల్ స్టార్క్(57 బంతుల్లో 7 ఫోర్లతో 41), అలెక్స్ క్యారీ(105 బంతుల్లో 8 ఫోర్లతో 66 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్కు ఓ వికెట్ దక్కింది.