లండన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మూడో రోజు చివరి సెషన్లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా కొందరు ప్రేక్షకులు పదే పదే సైట్ స్క్రీన్కు అడ్డుగా వచ్చారు. దాంతో క్రీజులో ఉన్న స్మిత్ బ్యాటింగ్ చేసేందుకు నిరాకరించాడు.
సైట్ స్క్రీన్కు అభిమానులు అడ్డుగా ఉన్నారని అంపైర్కు ఫిర్యాదు చేశాడు. పక్కకు జరగమని పదే పదే విజ్ఞప్తి చేసిన అంపైర్.. చివరకు సహనం కోల్పోయి రెండు చేతులతో దండం పెట్టాడు. 'మీకు ఓ దండంరా అయ్యా.. ఆ సైట్ స్క్రీన్ నుంచి పక్కకు తప్పుకోండి'అనేలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.

ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా సైట్ స్క్రీన్ డిస్టర్బ్గా ఉందని స్మిత్ పదే పదే బ్యాటింగ్కు నిరాకరించడంతో సిరాజ్ ఆగ్రహానికి గురయ్యాడు. రనప్ స్టార్ట్ చేయకముందే చెప్పొచ్చు కదా? అంటూ బంతిని నేలకు కొట్టాడు. దాంతో ఇద్దరి మధ్య కాసేపు మాటలు యుద్దం నడిచి గొడవ వాతావరణం నెలకొంది. మళ్లీ సిరాజ్ బౌలింగ్లో స్మిత్.. సైట్ స్క్రీన్ గురించి ఫిర్యాదు చేయడంతో అంపైర్ భయపడ్డాడు.
ఈ క్రమంలోనే పక్కకు తప్పుకోవాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
151/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు కుప్పకూలింది. అజింక్యా రహానే(129 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 89), శార్దూల్ ఠాకూర్(109 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకోగా.. రవీంద్ర జడేజా(51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48) విలువైన పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీసాడు. నాథన్ లయన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(1)ను సిరాజ్ ఔట్ చేయగా.. ఉస్మాన్ ఖవాజా(13)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. మార్నస్ లబుషేన్తో ఆచితూచిన ఆడిన స్టీవ్ స్మిత్(34)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ట్రావిస్ హెడ్తో కలిసి లబుషేన్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.
ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు.