లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. తొలి సెషన్లో ఇరు జట్లు సమంగా నిలిచాయి. భారత్ రెండు వికెట్లు తీయగా.. ఆస్ట్రేలియా 73 పరుగులతో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియాకు లభించిన మూమెంటమ్ను ఉమేశ్ యాదవ్ పాడు చేసాడు. చెత్త బౌలింగ్తో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో కుదురుకునేలా చేశాడు. అతని పేలవ బౌలింగ్లో పరుగులు రాబట్టిన ఆసీస్ బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించి స్వేచ్చగా ఆడారు.

ఇన్నింగ్స్ ఆరంభంలో పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్.. సూపర్ బౌలింగ్తో డేంజరస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో అద్భుతమైన ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బాల్తో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
దాంతో ఆసీస్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. డిఫెన్స్కే పరిమితమైంది. మరో ఎండ్లో షమీ కూడా లైన్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దాంతో 11 ఓవర్లలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 29 పరుగులే చేసింది. ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ.. ఉమేశ్ యాదవ్కు బంతినియ్యగా.. అతను దారుణంగా బౌలింగ్ చేశాడు.
తొలి ఓవర్లోనే బౌండరీ సమర్పించుకున్న అతను.. మరుసటి ఓవర్లో ఏకంగా నాలుగు బౌండరీలు సమర్పించుకున్నాడు. ఈ ఒక్క ఓవర్ టీమిండియా మూమెంటమ్ను దెబ్బతీసింది. డేవిడ్ వార్నర్ను క్రీజులో నిలదొక్కుకునేలా చేసింది. అనంతరం మరింత స్వేచ్చగా ఆడిన వార్నర్, లబుషేన్ వేగంగా పరుగులు రాబట్టారు.
సిరాజ్, షమీలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. మరింత ఒత్తిడిని పెంచి ఉంటే టీమిండియా సునాయసంగా మరో రెండు వికెట్లు తీసేది. కానీ ఉమేశ్ యాదవ్ పేలవ బౌలింగ్.. ఆసీస్ బ్యాటర్లకు ఊపిరినిచ్చింది. అనంతరం లయలోకి వచ్చిన ఉమేశ్ యాదవ్.. పరుగులివ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఇక సెషన్ ముగుస్తుందనగా.. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న వార్నర్ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు.
కేఎస్ భరత్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించాడు. ఇక రెండో సెషన్ ఆరంభంలోనే షమీ.. మార్నస్ లబుషేన్(26)ను పెవిలియన్ చేర్చాడు. అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.
క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్తో కలిసి స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.