లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. లండన్లోని ఓవల్ మైదానం వేదికగా భారత్తో జరుగుతున్న ఈ మెగా మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్(156 బంతుల్లో 22 ఫోర్లు, సిక్స్తో 146 బ్యాటింగ్) విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3 వికెట్లకు 327 పరుగులు చేసింది.
అతనికి తోడుగా స్టీవ్ స్మిత్(227 బంతుల్లో 14 ఫోర్లతో 95 బ్యాటింగ్) రాణించాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు అజేయంగా 251 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. రెండో రోజు ఆటలోనూ ఆసీస్ ఇదే జోరు కొనసాగిస్తే భారత్కు కష్టాలు తప్పవు.

ఐపీఎల్లో నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన భారత బౌలర్లు.. ఈ మ్యాచ్లో లాంగ్ స్పెల్స్ వేసేందుకు తెగ ఇబ్బంది పడ్డారు. ఓ దశలో భారత బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఏం చేయలేని నిస్సహాయత స్థితిలోకి వెళ్లిపోయారు.
ఫస్ట్ సెషన్ హోరా హోరీ..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ శుభారంభం అందించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన లబుషేన్తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.
ఆరంభంలో కాస్త తడబడిన ఈ జోడీ.. ఉమేశ్ యాదవ్ పేలవ బౌలింగ్తో క్రీజులో సెట్ అయ్యింది. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న డేవిడ్ వార్నర్(43)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో ఆసీస్ 73/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
షమీ వికెట్ తీసినా.
రెండో సెషన్ ఆరంభంలోనే లబుషేన్(26)ను మహమ్మద్ షమీ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో బ్యాటింగ్కు దిగిన ట్రావిస్ హెడ్.. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డే తరహా బ్యాటింగ్తో ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. మరో ఎండ్లో స్మిత్ నిదానంగా ఆడినా.. ట్రావిస్ హెడ్ చెలరేగాడు. తన బ్యాటింగ్తో భారత బౌలర్లపై ఒత్తిడి పెట్టాడు.
ఈ క్రమంలో 60 బంతుల్లో ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా ఆస్ట్రేలియా 170/3 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది. రెండో సెషన్లో పూర్తిగా ఆసీసే ఆధిపత్యం చెలాయించింది.
మూడో సెషన్లో ముచ్చమటలే..
చివరి సెషన్లోనూ స్మిత్-ట్రావిస్ హెడ్ ఇదే జోరును కొనసాగించారు. 144 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో ఆసీస్ ఇన్నింగ్స్కు తిరుగులేకుండా పోయింది. ఆ కొద్ది సేపటికే 106 బంతుల్లో ట్రావిస్ హెడ్ శతకాన్ని అందుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగింది.
ట్రావిస్ హెడ్ తన జోరును కొనసాగించగా.. స్మిత్ ఆచితూచి ఆడాడు. మూడో సెషన్లో ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. భారత బౌలర్లకు చుక్కలు చూపించింది.