లండన్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లీ చెత్త షాట్ ఆడాడని విమర్శించాడు. పనికిరాని హాఫ్ సెంచరీ కోసం అనవసర షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడని మండిపడ్డాడు.
ఆదివారం ముగిసిన ఈ మెగా ఫైనల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటతీరుపై స్పందించిన గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
'ఒక్క సెషన్లోనే ఏడు వికెట్లు పడటం అంటే భారత ఆటగాళ్ల చేతకాని తనమే. మరీ ఇలా ఆడుతారని అస్సలు ఊహించలేదు. అందరూ చెత్త షాట్లు ఆడే ఔటయ్యారు. 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన పుజారా ఇంత నిర్లక్ష్యమైన షాట్ ఆడుతాడని అనుకోలేదు. ఛేదించాల్సిన స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉందనే ఆలోచన పుజారాను తన శైలికి భిన్నంగా వింత షాట్కు ప్రయత్నించేలా చేసి ఉంటుంది.

విరాట్ కోహ్లీ ఆడిన షాట్ అయితే మరీ చెత్త. ఆఫ్ సైడ్కి దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ మూల్యం చెల్లించుకున్నాడు. అసలు ఆ షాట్ ఆడాల్సిన అవసరం ఏం ఉందో నాకు అర్థం కాలేదు. చాలా సార్లు ఆ బంతులను విరాట్ వదిలేశాడు. అయితే హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉండటంతోనే కోహ్లీ ఈ షాట్ ఆడి ఉంటాడు.
ఈ షాట్ ఎంత చెత్తదో అతన్నే అడగండి. పనికిరాని హాఫ్ సెంచరీ కోసం విరాట్ మూల్యం చెల్లించుకున్నాడు. కోహ్లీ ఒక్కడే కాదు జడేజా, రహానేలు కూడా హాఫ్ సెంచరీ మార్క్ కోసమే పేలవ షాట్లు ఆడి వెనుదిరిగారు. మ్యాచ్ గెలవాలంటే సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలి. ఇలాంటి షాట్స్ ఆడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. పేలవ బ్యాటింగే టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని గవాస్కర్ స్పష్టం చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 రన్స్కు కుప్ప కూలింది. విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్కు రెండు వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్కు ఓ వికెట్ దక్కింది.