లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా పుంజుకుంది. పేలవ బౌలింగ్తో తొలి రోజు భారీ స్కోర్ సమర్పించుకున్న భారత బౌలర్లు రెండో రోజు సత్తా చాటుతున్నారు. తొలి సెషన్లోనే మూడు కీలక వికెట్లు తీసారు. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ముందు శుభారంభం అందించగా.. షమీ, శార్దూల్ అదే జోరును కొనసాగించారు.
సెంచరీ హీరో ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163)ను సిరాజ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. షార్ట్ బాల్స్తో ట్రావిస్ హెడ్ను బోల్తా కొట్టించాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 285 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి కామెరూన్ గ్రీన్ రాగా.. మహమ్మద్ షమీ సూపర్ బౌలింగ్తో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.

కట్టడిగా బౌలింగ్ చేసి కామెరూన్ గ్రీన్(6) ఇగోను టచ్ చేసి వికెట్ సాధించాడు. ఆ కొద్ది సేపటికే సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన డేంజరస్ స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121)ను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో టీమిండియా మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది.
ఫస్ట్ సెషన్ పూర్తవ్వకుండా మూడు కీలక వికెట్లు తీయడంతో భారత ఆటగాళ్ల ముఖాల్లో నవ్వులు కనిపించాయి. రోహిత్ శర్మ అయితే మంచి జోష్లో కనిపించాడు. రివ్యూ సిగ్నల్తో అంపైర్ను కూడ ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
మహమ్మద్ షమీ వేసిన 100వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి రెండు బంతులకు అలెక్స్ క్యారీ ఇబ్బంది పడగా.. భారత ఆటగాళ్లు ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. అయితే లెగ్ స్టంప్ మిస్సయ్యే అవకాశం ఉందని వికెట్ కీపర్ కేఎస్ భరత్ చెప్పడంతో రోహిత్ శర్మ రివ్యూ తీసుకోలేదు. ఈ ఓవర్ తర్వాత అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇవ్వగా.. రోహిత్ రివ్యూ సిగ్నల్ ఇచ్చినట్లు చేతులు లేపాడు.
దాంతో అంపైర్ అయోమయానికి గురయ్యాడు. వెంటనే మూడో అంపైర్ సమీక్ష కోరేందుకు సిద్దమయ్యాడు. కానీ కోహ్లీ అతను అడగలేదని చెప్పడంతో వెనక్కి తగ్గాడు. రోహిత్ శర్మ చర్యతో భారత ఆటగాళ్లు మాత్రం నవ్వుకున్నారు. రోహిత్ చేసిన పనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. రోహిత్ మంచి జోష్లో ఉన్నాడు కదా? అని కామెంట్ చేస్తున్నారు.