హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట తప్పాడు. ఐపీఎల్ మోజులో పడి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రిపరేషన్స్ను గాలికొదిలేసాడు. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 7-11 మధ్య లండన్లోని ఒవల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
గత 10 ఏళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ లీగ్ దశలోనే ఇంటిదారిపట్టింది. 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు 2022 టీ20 ప్రపంచకప్లోనూ సెమీస్లోనే ఓటమిపాలైంది.

ఇక ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకొని డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా.. ఈ మ్యాచ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచి ఐసీసీ ట్రోఫీల నిరీక్షణకు తెరదించుతామని కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. ఓవైపు ఐపీఎల్ 2023 సీజన్ జరుగుతున్నా మరోవైపు డబ్ల్యూటీసీ ప్రిపరేషన్స్ కొనసాగుతాయని, ఆటగాళ్ల వర్క్లోడ్ను బీసీసీఐ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని చెప్పాడు.
అంతేకాకుండా తమ ప్రధాన పేసర్లు ఏ ఫ్రాంచైజీతో ఉన్నా డ్యూక్ బాల్స్తో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తారని తెలిపాడు. ఐపీఎల్ కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రిపరేషన్స్కు ఎలాంటి లోటు కాకుండా చూసుకుంటామని స్పష్టం చేశాడు. కానీ ఐపీఎల్ ప్రారంభమైన వెంటనే ఈ మాటలను రోహిత్ పూర్తిగా మరిచిపోయాడు. ఇతర ఫ్రాంచైజీల సంగతి దేవుడెరుగు తానే డబ్ల్యూటీసీ ప్రిపరేషన్ను మరిచిపోయాడు.
ఇప్పటి వరకు జరిగిన ఏడు ఐపీఎల్ మ్యాచ్ల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు ఎంపికైన ప్రతీ ఆటగాడు అన్ని మ్యాచ్లు ఆడారు. వర్క్లోడ్ మేనేజ్మెంటే అనే మాట ఎక్కడా వినిపించలేదు. సిరాజ్, మహమ్మద్ షమీలు డ్యూక్ బాల్స్తో నెట్స్లోప్రాక్టీస్ చేస్తున్నట్లు కూడా కనిపించలేదు. రోహిత్ శర్మనే కాదు బీసీసీఐ కూడా పెద్దగా పట్టించుకోలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టునే మంగళవారం ప్రకటించింది.
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ దశ ప్రారంభమవ్వగా.. నాకౌట్ చేరిన జట్లలోని ఆటగాళ్లు ఇంగ్లండ్ బయల్దేరి టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొంటారని బోర్డు వర్గాలు తెలిపాయి. మే 23 నుంచి ఈ ప్రాక్టీస్ క్యాంప్ మొదలవ్వనుందని, కోచ్ రాహుల్ ద్రవిడ్ మే 20నే ఇంగ్లండ్ బయల్దేరుతారని సమాచారం. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం తమ ఆటగాళ్లను ఇంగ్లండ్ పంపించి కౌంటీ క్రికెట్ ఆడిస్తోంది. ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్లను మే 20లోపు ఇంగ్లండ్ చేరుకోవాలని ఆదేశించింది.