లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉండనుండటంతో ఏకైక స్పిన్నర్తో బరిలోకి దిగుతున్నామని చెప్పిన రోహిత్.. టీమ్ కాంబినేషన్లో భాగంగానే తప్పని పరిస్థితుల్లో అశ్విన్ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు.
ఇక అందరూ ఊహించనట్లుగానే టీమిండియా ఎక్స్ట్రా పేసర్ శార్దూల్ ఠాకూర్తో బరిలోకి దిగగా.. మూడో పేసర్గా ఉమేశ్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్గా కేఎస్ భరత్కే అవకాశం ఇచ్చారు.

అయితే ఈ నిర్ణయాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. కేఎస్ భరత్కు బదులు ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కేఎస్ భరత్ కంటే ఇషాన్ కిషన్ ఎంతో బెటరని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇషాన్ కిషన్ కారణంగా జట్టుకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లభించేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత జట్టులో రవీంద్ర జడేజా ఒక్కడే లెఫ్టాండర్ అని, మిగతా ఆటగాళ్లంతా రైట్ హ్యాండర్లేనని గుర్తు చేస్తున్నారు.
ఇది ఆస్ట్రేలియా బౌలర్లకు మేలు చేస్తుందని, తరుచూ తమ బౌలింగ్ గార్డ్ను మరుచుకోవాల్సిన పరిస్థితి ఉండదని, ఫీల్డింగ్లో కూడా ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఇది ఆసీస్కు అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు. బౌలర్లు కూడా తరుచూ తమ లెంగ్త్ను మార్చుకోవాల్సిన అవసరం ఉండదని గుర్తు చేస్తున్నారు.
దిగ్గజ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులంతా ఇషాన్ కిషన్ను ఆడించాలని సూచించినా.. కేఎస్ భరత్కు అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు.అయితే స్వింగ్ కండిషన్స్లో వికెట్ల వెనుకాల స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అవసరం ఉందనే టీమిండియా కేఎస్ భరత్ను కొనసాగించిందని రోహిత్ శర్మ ఫ్యాన్స్ వివరణ ఇస్తున్నారు. బ్యాటర్లు ఇచ్చే క్యాచ్లను అందుకోవడం చాలా ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు.
తుది జట్లు:
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎస్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ(కీపర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లయన్, స్కాట్ బోలాండ్.