హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు రంగం సిద్దమైంది. మరో 48 గంటల్లో ఈ మెగా ఫైనల్కు తెరలేవనుంది. లండన్లోని ఓవల్ మైదానం ఈ టైటిల్ ఫైట్కు ఆతిథ్యం ఇస్తుండగా.. భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు లండన్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. మ్యాచ్ గెలిచే వ్యూహాలతో పాటు టీమ్ కాంబినేషన్స్పై ప్రత్యేక దృష్టిసారించాయి.
ఆస్ట్రేలియా తుది జట్టు విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. టీమిండియా ఫైనల్ ఎలెవన్ ఎంపిక కెప్టెన్ రోహిత్ శర్మకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా మూడు అంశాలు రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ను వెంటాడుతున్నాయి.

1. ఇద్దరు స్పిన్నర్లా? ఏకైక స్పిన్నరా..?
ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలా? లేక ఏకైక స్పిన్నర్తో ఆడాలా? అనేది రోహిత్ సేన తేల్చుకోలేకపోతుంది. రవీంద్ర జడేజా, రవీచంద్రన్ అశ్విన్ కాంబినేషన్కు మంచి రికార్డు ఉంది. 25 టెస్ట్ల్లో ఈ జోడీ 104 వికెట్లు పడగొట్టింది. అయితే విదేశాల్లో మాత్రం టీమిండియా ఈ జోడీని కొనసాగించలేకపోతుంది.
పేస్కు అనుకూలమైన పిచ్లు ఉండటంతో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జడేజానే ఆడించింది. 2021 ఇంగ్లండ్ పర్యటనలో ఐదింటికి ఐదు మ్యాచ్ల్లో జడేజానే ఆడగా.. అశ్విన్ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే రవి శాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు ఇద్దర్ని ఆడించాలని సూచిస్తుండగా.. ఇర్ఫాన్ పఠాన్ వంటి ఆటగాళ్లు మాత్రం పిచ్ కండిషన్స్ బట్టి ఈ నిర్ణయం తీసుకోవాలంటున్నారు.
2. శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, ఉనాద్కత్?
మూడో పేసర్గా శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్లో ఎవర్ని ఆడించాలనేది కూడా రోహిత్ సేన తేల్చుకోలేకపోతుంది. శార్దూల్ను తుది జట్టులోకి తీసుకుంటే అతను లోయరార్డర్లో బ్యాటింగ్ కూడా చేయగలడు. కానీ ఇంగ్లండ్ కండిషన్స్పై శార్దూల్కు మెరుగైన బౌలింగ్ రికార్డ్స్ లేవు. ఉమేశ్ యాదవ్ అయితే పేస్తో పాటు స్వింగ్ కూడా రాబట్టగలడు.
బుమ్రా గైర్హాజరీలో ఉమేశ్ యాదవ్ జట్టుకు అడ్వాంటేజ్గా మారుతాడని విశ్లేషకులు అంటున్నారు. బౌలింగ్లో వైవిధ్యం కావాలంటే జయదేవ్ ఉనాద్కత్ను తీసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. అయితే ఉనాద్కత్కు ఇంగ్లండ్ కండిషన్స్ అనుభవం లేకపోవడం, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అతన్ని తీసుకోకపోవడమే ఉత్తమమని మరికొందరు అంటున్నారు.
3.కేఎస్ భరత్ లేదా ఇషాన్ కిషన్?
టీమిండియా వికెట్ కీపర్గా కేఎస్ భరత్, ఇషాన్ కిషన్లలో ఎవర్ని ఆడించాలనే విషయాన్ని కూడా రోహిత్ సేన తేల్చుకోలేకపోతుంది. రిషభ్ పంత్ గైర్హాజరీతో టీమిండియాకు ఈ సమస్య మొదలైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కేఎస్ భరత్ ఆడినా.. పంత్ లేని లోటును తీర్చలేకపోయాడు. కీపింగ్లో అదరగొట్టినా బ్యాటింగ్లో విఫలమయ్యాడు.
ఈ క్రమంలోనే దూకుడుగా బ్యాటింగ్ చేసే ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే రెడ్ బాల్ క్రికెట్లో ఇషాన్ కిషన్కు కీపింగ్ చేసిన అనుభవం లేదు. కేఎల్ రాహుల్ ఉంటే అతన్నే కీపర్గా ఆడించాలని టీమిండియా భావించింది. కానీ అతను తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దాంతో సమస్య మొదటికి వచ్చింది.