లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా తడబాటు కొనసాగుతోంది. 444 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 93 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి శుభ్మన్ గిల్(18) బలవ్వగా.. 51 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43), చతేశ్వర్ పుజారా(47 బంతుల్లో 5 ఫోర్లతో 27) అనవసరపు షాట్లతో పెవిలియన్ బాట పట్టారు.

శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించిన రోహిత్.. వన్డే తరహా బ్యాటింగ్తో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన ట్రేడ్మార్క్ పుల్ షాట్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. మరోవైపు శుభ్మన్ గిల్ సైతం స్వేచ్చగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. 41 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని బోలాండ్ విడదీసాడు.
అతను వేసిన ఆఫ్ స్టంప్ బాల్ను శుభ్మన్ గిల్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. బంతి ఎడ్జ్ తీసుకొని సెకండ్ స్లిప్ గల్లిలోకి దూసుకెళ్లింది. ఈ బంతిని కామెరూన్ గ్రీన్ సూపర్ డైవ్తో సింగిల్ హ్యాండ్తో అందుకున్నాడు. క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించింది. దాంతో అంపైర్లు సమీక్ష కోరగా.. రిప్లేలో స్పష్టత లభించలేదు.
కానీ థర్డ్ అంపైర్ మాత్రం బంతి కింద గ్రీన్ వేళ్లు ఉన్నాయని ఔటిచ్చాడు. అయితే ఇది నాటౌట్ అని తేలడంతో ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా.. రోహిత్ శర్మకు అండగా నిలిచాడు. తన శైలికి భిన్నంగా బౌండరీలు బాదుతూ పరుగులు రాబట్టాడు. 51 పరుగులతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్పిన్నర్ నాథన్ లయన్ సాయంతో కమిన్స్ విడదీసాడు.
నాథన్ వేసిన 20వ ఓవర్లో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకపోయింది. ఆ షాట్ ఆడాలా? వద్దా? అనే డబుల్ మైండ్సెట్తో రోహిత్ మూల్యం చెల్లించుకున్నట్లు కనిపించింది. కమిన్స్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే పుజారా అప్పర్ కట్ ఆడే ప్రయత్నంలో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
ఈ రెండు వికెట్లలో ఆసీస్ బౌలర్ల గొప్పతనం ఏం లేదు. భారత బ్యాటర్లే చేజేతులా వికెట్ సమర్పించుకున్నారు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రహానే ఆచితూచి ఆడుతున్నారు.