న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫేవరేట్గా బరిలోకి దిగినా.. ఓడిపోవడానికి ఒక్క సెషన్ చాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. ఎంత బాగా ఆడినా అదృష్టం కలిసిరాకపోతే ఏం చేయలేమన్నాడు. జూన్ 7 నుంచి 11 వరకు లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
అరంగేట్ర డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్.. ఈ సారి కచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఈ మ్యాచ్ ఫలితంపై మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు తమ అంచనాలను వెల్లడించారు. ఇంగ్లండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుండటం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశమని, ఆ జట్టే ఫేవరేటని చాలా మంది అభిప్రాయపడ్డాడు.

ఆస్ట్రేలియా ఫేవరేట్ అనే వ్యాఖ్యలపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్లో జరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ ఆస్ట్రేలియానే ఫేవరెట్గా అంటున్నారు. కానీ, ఇది ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే అనే విషయాన్ని గ్రహించాలి. ఒక్క రోజు..ఒక్క సెషన్ బాగా ఆడకపోయినా మ్యాచ్ చేజారుతోంది. కాబట్టి.. ఆస్ట్రేలియా కూడా జాగ్రత్తగా ఆడాలి.
ఐసీసీ టోర్నీల్లో గెలవాలంటే ఎవరైనా గట్టిగా పోరాడాల్సిందే. అయితే కొన్నిసార్లు ఎంత బాగా ఆడినా అదృష్టం లేకుంటే విజయాన్ని అందుకోలేం. టీమిండియా అదృష్టం లేకనే గత 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది. టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచే సత్తా ఉంది. నేను కోచ్గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెబుతుండేవాడిని. గత మూడు, నాలుగేళ్ల నుంచి ఈ జట్టుకు ఐసీసీ ట్రోఫీ గెలిచే సత్తా ఉందని నమ్ముతున్నాను. ఆ శక్తి ఆటగాళ్లలో ఇప్పటికీ ఉందని భావిస్తున్నా'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.
2013లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా చివరి సారిగా ఐసీసీ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన చేసినా సెమీస్, ఫైనల్లోనే ఓడి ఇంటిదారిపట్టింది. రవి శాస్త్రి కోచ్గా ఉండగా కోహ్లీ సారథ్యంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో 2021 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలైంది.