న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే భారత జట్టును ఆలిండియా సెలెక్షన్ కమిటీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టులో భారీ మార్పులు చేయకున్నా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేకు మరోసారి అవకాశం కల్పించింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్లపై వేటు వేసిన సెలెక్షన్ కమిటీ.. అనుభవానికి ప్రాధన్యత ఇచ్చింది.
అజింక్యా రహానేకు అవకాశం ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మాజీ క్రికెటర్లు సెలెక్షన్ల నిర్ణయాన్ని ప్రశంసించగా.. కొందరు అభిమానులు మాత్రం తప్పుబట్టారు. ఈ క్రమంలోనే మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రికి చిక్కు ప్రశ్న ఎదురైంది. రహానే ఎంపికను ఎటకారం చేస్తూ సదరు వ్యక్తి ప్రశ్నించగా.. రవి శాస్త్రి తనదైన శైలిలో బదులిచ్చాడు.

'మహేంద్ర సింగ్ ధోనీని కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు కదా. ఇప్పటికీ అతను ఫిట్గా ఉన్నాడు. వికెట్ కీపర్ - బ్యాటర్గా సరిపోతాడు'అని రవిశాస్త్రిని యాంకర్ ప్రశ్నించగా.. దానికి సమాధానంగా.. ''దేశంలో చాలా మంది యువ వికెట్ కీపర్లకు ధోనీ మార్గదర్శి. అతన్ని వికెట్ల వెనుక అనుసరించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే గొప్ప వికెట్ కీపర్గా ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచాడు.'అని చెప్పాడు.
'ఒకవేళ ధోనీ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని వస్తే అతడిని పరిగణనలోకి తీసుకుంటారా..? ' అని అడగ్గా.. ''ధోనీ రిటైర్మెంట్ను అస్సలు వెనక్కి తీసుకోడు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే అదే ఫైనల్ అవుతుంది. మరో సంవత్సరం ఆడే అవకాశం ఉన్నప్పటికీ.. టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలని భావించాడు. ఆ నిర్ణయం ప్రకటించాడు.
అతను గణాంకాలను చూసే ఆటగాడైతే.. 100 టెస్టుల మార్క్ను దాటాక గుడ్బై చెప్పే అవకాశం ధోనీకి ఉంది. భారీ ప్రేక్షక సందోహం మధ్య, అద్భుతమైన ప్రెజెంటేషన్, వీడ్కోలు కార్యక్రమం.. ఇలా ప్రతి ఒక్కరూ కోరుకొనే విధానంలో కాకుండా చాలా సింపుల్గా నిర్ణయం వెల్లడించాడు. ఇప్పుడు జట్టులో కొత్త ఆటగాడు ఉన్నాడు. వారిని ఆడించాలి'' అని రవిశాస్త్రి తెలిపాడు.
ఐపీఎల్ ప్రదర్శనను చూసి అజింక్యా రహానేను ఎంపిక చేయలేదని రవి శాస్త్రి స్పష్టం చేశాడు. టీమిండియాకు దూరమైన తర్వాత రహానే ఇంగ్లండ్లో 5-6 నెలలు కౌంటీ క్రికెట్ ఆడాడని, అక్కడ సెంచరీల మోత మోగించాడని గుర్తు చేశాడు. ఈ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందనే ఎంపిక చేశారని స్పష్టం చేశాడు.