న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 7-11 మధ్య లండన్లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గత మంగళవారం ప్రకటించింది.
రెండు, మూడు మార్పులు మినహా బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడిన జట్టునే దాదాపు కొనసాగింది. వెన్ను గాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేను తీసుకున్న సెలెక్టర్లు.. ఇషాన్ కిషన్తో పాటు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్లపై వేటు వేసింది. దాదాను ఏడాదిన్నర తర్వాత అనూహ్య పరిస్థితుల్లో రహానే టీమిండియాలోకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

గతేడాది సౌతాఫ్రికా పర్యటనలో చివరి సారిగా భారత్కు ప్రాతినిథ్యం వహించిన అజింక్యా రహానే పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోవడంతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. దాంతో అతని కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ రంజీ ట్రోఫీలో సత్తా చాటిన రహానే.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
ధోనీ సారథ్యంలో రహానే 2.0ను తలపిస్తున్నాడు. అయితే రహానేను ఎంపిక చేసేముందు టీమిండియా మేనేజ్మెంట్ ధోనీ అభిప్రాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా ధోనీకి ఫోన్ చేసి రహానే ఫిట్నెస్, ఆటతీరుపై ఫిడ్ బ్యాక్ తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
'శ్రేయస్ అయ్యర్ దూరమైనప్పటి నుంచి అజింక్యా రహానే మా ప్రణాళికల్లో ఉన్నాడు. అతనికి ఇంగ్లండ్లో ఆడిన అనుభవం ఉంది. అక్కడ మంచి రికార్డు కూడా ఉంది. అయితే గతేడాదిగా అతను మా టీమ్ సెటప్లో లేడు. రంజీ ట్రోఫీలో ఎలా ఆడిందనేదే మాకు తెలుసు. అందుకే రాహుల్ ద్రవిడ్ ధోనీ ఇన్పుట్స్ తీసుకున్నాడు.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
రంజీ ట్రోఫీలో ముంబై జట్టు కెప్టెన్గా రహానే.. 11 ఇన్నింగ్స్ల్లో 57.63 యావరేజ్తో 634 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్ల్లో 209 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్రేట్ 199.04గా ఉండటం విశేషం. స్వింగ్ బౌలింగ్ను అద్భుతంగా ఆడగలిగే సామర్థ్యం రహానేకు ఉంది.