హైదరాబాద్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో ఈ మెగా ఫైనల్కు తెరలేవనుంది. లండన్లోని ఓవల్ మైదానం ఈ మెగా మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండగా.. భారత్, ఆస్ట్రేలియా టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా ముమ్మరంగా సాధన చేశాయి.
అయితే ఈ మెగా ఫైనల్కు ముందు అశ్విన్కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని భారత అనలిస్ట్ ప్రసన్న అగోరమ్ మీడియాతో పంచుకున్నాడు. ఈ మెగా ఫైనల్లో అశ్విన్ ఆడటంపై సందేహాలు నెలకొన్నప్పటికీ.. ఈ టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఐపీఎల్ 2023 సీజన్ జరుగుతుండగానే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం విన్నింగ్ ఫార్మూలాను సిద్దం చేశాడని ప్రసన్న అగోరమ్ తెలిపాడు.

ది ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ విషయాలను వెల్లడించాడు. ఐపీఎల్ 2023 సీజన్ జరుగుతుండగానే.. ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తన దినచర్యను మార్చుకున్నాడని, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లేని సమయంలో త్వరగా పడుకోవడం వంటి పనులు చేశాడని తెలిపాడు.
అంతేకాకుండా ఆస్ట్రేలియా బ్యాటర్లకు సంబంధించిన రికార్డులు, ఒవల్ కండిషన్స్ గురించి తనతో తరుచు మాట్లాడాడని వెల్లడించాడు. ఈ సీజన్లో ఓవల్ పిచ్ ఎన్ని డిగ్రీల మేరకు టర్న్ అయ్యింది? గతంలో ఎన్ని డిగ్రీల టర్న్ లభించింది?, ప్రతీ రోజు ఎంత టర్న్ ఉంటుంది?, బంతి టర్న్ కానప్పుడు బ్యాటర్లను అడ్డుకోవడానికి ఉపయోగించాల్సిన ఐడియల్ ప్లాన్ ఏంటి?,
లబుషేన్, స్మిత్లు స్పిన్ బౌలర్లలో ఎలాంటి షాట్స్ ఆడారు?, ఈ సీజన్ కౌంటీ క్రికెట్లో ఎలాంటి షాట్స్ ఆడారు?, ఇంగ్లండ్ గడ్డపై స్పిన్ బౌలింగ్లో ఉస్మాన్ ఖవాజా రికార్డు ఎలా ఉంది? అనే అంశాలపై తనతో తరుచూ చర్చించేవాడని ప్రసన్న అగోరమ్ తెలిపాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం అశ్విన్ చాలా అనలైటికల్గా సిద్దమయ్యాడని, ఆసీస్ బ్యాటర్ల బలహీనతకు అనుగుణంగా తన బౌలింగ్ అస్త్రాలను సిద్దం చేసుకున్నాడని అగోరమ్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ కండిషన్స్కు తగ్గట్లు అశ్విన్ మానసికంగా, బౌతికంగా పకడ్బందీగా సిద్దమయ్యాడని తెలిపాడు.
అయితే ఓవల్ పిచ్ పూర్తిగా పచ్చ గడ్డితో ఉండటంతో అశ్విన్ను తుది జట్టులోకి తీసుకునే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. మాజీ ఆటగాళ్లు మాత్రం టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం బుధవారం పిచ్ను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు 15 మంది ఆటగాళ్లు మ్యాచ్ కోసం సిద్దంగా ఉండాలని చెప్పాడు.