లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో ఈ మెగా మ్యాచ్కు తెరలేవనుంది. లండన్లోని ఓవల్ మైదానం ఈ బ్లాక్బస్టర్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండగా.. మేటి జట్లు అయిన ఆస్ట్రేలియా, భారత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు ప్రిపరేషన్స్ను పూర్తి చేసుకున్నాయి.
ఈ మ్యాచ్ కోసం పూర్తిగా గ్రీన్ వికెట్ను సిద్దం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలను చూస్తే.. వికెట్పై గడ్డి కనబడుతోంది. పేసర్లకు బాగా అనుకూలించే అవకాశం ఉంది. సహజంగా ఆట జరుగుతున్న కొద్ది ఈ వికెట్పై టర్న్ లభిస్తోంది. ముఖ్యంగా చివరి రెండు రోజులు స్పిన్నర్లు చెలరేగుతారు. గత రికార్డులను పరిశీలిస్తే ఇక్కడ పేసర్ల కంటే స్పిన్నర్లకే మెరుగైన రికార్డు ఉంది.

అయితే సాధారణంగా ఇక్కడ ఆగస్టు, సెప్టెంబర్లో మ్యాచ్లు జరిగేవి. అప్పుడు వాతావరణం పొడిగా ఉండి పిచ్ డ్రైగా మారేది. బ్యాటింగ్కు అనుకూలించేది. కానీ జూన్లోనే ఇక్కడ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. అక్కడి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిచ్పై విపరీతమైన స్వింగ్తో పాటు అనూహ్య బౌన్స్ లభించే అవకాశం ఉంది.
పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కొంత బంతిని ఎదుర్కొవడం బ్యాటర్లకు సవాల్తో కూడుకున్నదే. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్కు తొలి మూడు రోజులు వర్ష సూచన లేదు. కానీ శని, ఆది, సోమవారాల్లో వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఉష్ణోగ్రత సగటు 20 డిగ్రీల సెల్సియస్గా ఉండనుంది.
పిచ్ కండిషన్స్ నేపథ్యంలో టీమిండియా ఏకైక స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. చివరి మూడు రోజులు వర్షం పడనున్న నేపథ్యంలో స్పిన్నర్లకు అడ్వాంటేజ్ లభించే అవకాశం లేదు. కాబట్టి టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ఏకైక స్పిన్నర్తోనే బరిలోకి దిగనున్నాయి.
ఓవల్ వికెట్పై ఇరు జట్లకు మెరుగైన రికార్డు లేదు. 38 టెస్ట్ల్లో ఆసీస్ ఏడు మ్యాచ్లే గెలవగా.. 14 మ్యాచ్ల్లో భారత్ రెండు మాత్రమే గెలుపొందింది. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్కు ఈ వికెట్పై మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు స్మిత్ ఓవల్లో మూడు మ్యాచ్లు ఆడి 97.75 సగటుతో 391 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి.