లండన్: టీమిండియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 469 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్(4/108) నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ ఆట సెషన్నరలోనే ముగిసింది.
ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్కు తోడుగా మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీసారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.

327/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా తడబడింది. ఓవర్ నైట్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించినా.. ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయింది. తొలి ఓవర్లోనే స్మిత్ వరుసగా రెండు బౌండరీలు బాది 229 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ వెంటనే ట్రావిస్ హెడ్ 164 బంతుల్లో 150 పరుగులు చేసుకున్నాడు.
కానీ ఈ జోడీని మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్తో విడదీసాడు. షార్ట్ పిచ్ బాల్తో డెంజరస్ ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163)ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 285 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి కామెరూన్ గ్రీన్ రాగా.. మహమ్మద్ షమీ సూపర్ బౌలింగ్తో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
ప్లాన్ చేసి స్లిప్ క్యాచ్గా బోల్తా కొట్టించాడు. ఆ కొద్ది సేపటికే సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన డేంజరస్ స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121)ను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. అక్షర్ పటేల్ స్టన్నింగ్ త్రో మిచెల్ స్టార్క్ను పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ కమిన్స్తో కలిసి అలెక్స్ క్యారీ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించాడు. దాంతో ఆసీస్ 422/7 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
లంచ్ అనంతరం అలెక్స్ క్యారీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ధాటిగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చాడు. రోహిత్ శర్మ స్టన్నింగ్ రివ్యూతో ఈ వికెట్ రాబట్టాడు. అనంతరం సిరాజ్.. నాథన్ లయన్(9), ప్యాట్ కమిన్స్(9)ను పెవిలియన్ చేర్చి ఆసీస్ తొలి ఇన్నింగ్స్కు తెరదించాడు.