హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమితో జట్టులోని పలువురి ఆటగాళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు వారి కెరీర్కు ఎండ్ కార్డ్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాతో పాటు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్, వికెట్ కీపర్ కేఎస్ భరత్లను పూర్తిగా పక్కకు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ ముగ్గురు ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఉమేశ్ యాదవ్, పుజారా వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. టెస్ట్ స్పెషలిస్ట్ అయిన పుజారా.. గత రెండు నెలలు ఇంగ్లండ్లోనే ఉంటూ కౌంటీ ఛాంపియన్షిప్ ఆడాడు. అక్కడ అసాధారణ ప్రదర్శనతో పరుగుల మోత మోగించాడు.

దాంతో టీమిండియా బ్యాటింగ్లో పుజారా కీలకం అవుతాడని అంతా భావించారు. ఇంగ్లండ్ కండిషన్స్కు పూర్తిగా అలవాటు పడిన పుజారా.. జట్టుకు వెన్నుముక అవుతాడనుకున్నారు. కానీ పుజారా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
తొలి ఇన్నింగ్స్లో 14 పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ అయిన పుజారా.. రెండో ఇన్నింగ్స్లో 27 పరుగులకే చెత్త షాట్తో వెనుదిరిగాడు. డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్లో ఒకే ఒక్క సెంచరీ బాదిన పుజారా.. గత మూడేళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఈ క్రమంలోనే అతన్ని శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు దూరంగా ఉంచారు. కౌంటీల్లో సత్తా చాటడంతో మళ్లీ తుది జట్టులో చోటు కల్పించారు. కానీ అతను వరుసగా విఫలమైన జట్టు ఓటమికి కారణమయ్యాడు.

ఇక అశ్విన్ను కాదని తుది జట్టులోకి తీసుకున్న ఉమేశ్ యాదవ్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 469 పరుగులు చేయడానికి ఉమేశ్ యాదవ్ చెత్త బౌలింగే ప్రధాన కారణం. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్న ఆసీస్కు పేలవ బౌలింగ్తో స్వేచ్చగా ఆడేలా చేసాడు. ఇప్పటికే తుది జట్టులో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతున్న ఉమేశ్ యాదవ్... ఈ వైఫల్యంతో పూర్తిగా జట్టుకు దూరం కానున్నాడు.

ఈ ఇద్దరితో పాటు తెలుగు తేజం, వికెట్ కీపర్ కేఎస్ భరత్పై కూడా వేటు పడనుంది. వికెట్ కీపర్గా భరత్ అసాధారణ ప్రదర్శన కనబర్చినా.. బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో తుది జట్టులోకి వచ్చిన కేఎస్ భరత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 129 పరుగులే చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో(5, 23) పరుగులతో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ క్రమంలోనే భరత్ను పక్కనపెట్టి ఇషాన్ కిషన్ను సిద్దం చేసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఇషాన్ కిషన్తో పాటు జితేశ్ శర్మకు కూడా అవకాశం దక్కనుంది. వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసే టెస్ట్ టీమ్లో ఈ ముగ్గురిపై వేటు పడే అవకాశాలున్నాయి. వీరి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, జితేశ్ శర్మలు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.