లండన్: ప్రతిష్టాత్మక ఫైనల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ అజింక్యా రహానే అద్భుతంగా పోరాడుతున్నాడు. 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును రహానే అసాధారణ బ్యాటింగ్తో ఆదుకున్నాడు. ముందుగా రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రహానే.. రెండో రోజు శ్రీకర్ భరత్ ఔటైనా.. శార్దూల్ ఠాకూర్తో కలిసి అజేయంగా 108 పరుగులు జోడించాడు.
దాంతో 151/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 260/6 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. అయితే రహానే గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్ చేస్తుండటం గమనార్హం. రెండో రోజు బ్యాటింగ్ చేస్తుండగా రహానే చేతి వేలికి గాయమైంది. ఆ వేలికి బ్యాండేజ్ వేసుకొని బ్యాటింగ్ చేసిన రహానే.. మూడో రోజు కూడా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు.

మరోసారి బంతి గాయంపైనే తాకడంతో నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేయగా.. రహానే మొండిగా బ్యాటింగ్ చేస్తున్నాడు.ఈ క్రమంలో టెస్ట్ ఫార్మాట్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 13వ భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. 141 ఇన్నింగ్స్ల్లో రహానే.. 26 హాఫ్ సెంచరీలు, 12 శతకాలు నమోదు చేశారు.
టెస్ట్ల్లో అతని అత్యధిక స్కోర్ 188 కాగా. సగటు 39.09గా ఉంది. అంతేకాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. సెంచరీకి 11 పరుగుల దూరంలో ఉన్న రహానే.. శార్దూల్తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నాడు. దాంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో 100 ప్లస్ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీగా రహానే-శార్దూల్ చరిత్రకెక్కారు.
ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లకు తోడుగా మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీసారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.